చిరు సరైనోడినే పట్టాడులే..

మెగాస్టార్ చిరంజీవి మలయాళ బ్లాక్‌బస్టర్ ‘లూసిఫర్’ రీమేక్‌లో నటించనున్నాడని ఏడాది కిందటే ఖరారైంది. ఆ సినిమా మలయాళంలో విడుదలైన కొంత కాలానికే రామ్ చరణ్ రీమేక్ హక్కులు తీసేసుకున్నాడు. ఇక అప్పట్నుంచి ఈ చిత్ర దర్శకుడిగా ఎన్నో పేర్లు వినిపించాయి. సుకుమార్, సుజీత్, వి.వి.వినాయక్, హరీష్ శంకర్.. ఇలా ఒక్కో సమయంలో ఒక్కో పేరు ప్రచారంలో ఉంది.

సుజీత్‌ స్థానంలోకి వినాయక్ రాగానే ఈ సినిమాకు అన్నీ సెట్ అయినట్లే అనుకున్నారంతా. కానీ వినాయక్ చేసిన వర్క్ చిరుకు నచ్చక అతను కూడా తప్పుకోవాల్సి వచ్చింది. హరీష్ శంకర్ వెంటనే ఈ సినిమాను టేకప్ చేసే పరిస్థితుల్లో లేడు. అతడి దృష్టంతా పవన్ కళ్యాణ్ సినిమా మీదే ఉంది. పవర్ స్టార్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు ఆ సినిమా చేసేద్దామని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘లూసిఫర్’ రీమేక్ కోసం తమిళ దర్శకుడైన మోహన్ రాజాను ఫైనలైజ్ చేసినట్లు తాజాగా వార్తలొస్తున్నాయి.

మోహన్ రాజా బ్యాగ్రౌండ్ తెలిస్తే అతను ఈ రీమేక్‌కు పర్ఫెక్ట్ అని అర్థమవుతుంది. ‘తనీ ఒరువన్’, ‘వేలైక్కారన్’ సినిమాలతో మోహన్ రాజా తన ఒరిజినల్ టాలెంట్ చూపించాడు కానీ.. అంతకుముందు అంతా అతడి కెరీర్లో అన్నీ రీమేక్‌లే. చాలా ఏళ్ల కిందట ఓ మలయాళ మూవీని ‘హనుమాన్ జంక్షన్’ పేరుతో తెలుగులో రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టాడు మోహన్ రాజా. ఆ తర్వాత తన తమ్ముడు రవిని హీరోగా పరిచయం చేస్తూ ‘జయం’ సినిమాను తమిళంలో తీశాడు. అది బ్లాక్‌బస్టర్ కావడంతో వరుసబెట్టి రీమేక్‌ సినిమాలే చేస్తూ వచ్చాడు.

బొమ్మరిల్లు, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆజాద్.. ఇలా చాలా సినిమాలనే రీమేక్ చేశాడు. అందులో చాలా వరకు హిట్లే. ఇలా వరుసబెట్టి రీమేక్‌లే చేయడంతో అతడికి రీమేక్ రాజా అని పేరొచ్చింది. ఐతే తనీ ఒరువన్ సినిమాతో తన ఒరిజినల్ టాలెంట్ చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తర్వాత వేలైక్కారన్‌తోనూ ఆకట్టుకున్నాడు. అతను చాలా వరకు రీమేక్‌లే చేసినప్పటికీ.. మాతృక అందం చెడకుండా, మరింత ఆకర్షణీయంగా తీసే టాలెంట్ ఉంది. కమర్షియల్ సినిమాలను చాలా బాగా డీల్ చేయగలడు. అలాంటి దర్శకుడిని ‘లూసిఫర్’ రీమేక్‌కు ఎంచుకోవడం మంచి నిర్ణయమే. మోహన్ రాజా పేరు తెచ్చుకుంది తమిళంలోనే అయినా.. అతను బేసిగ్గా తెలుగువాడు కావడం విశేషం. ఒకప్పటి ఎడిటర్ మోహన్ తనయుడే ఈ మోహన్ రాజా.