వైసీపీలో కొత్త జిల్లాల జోష్‌.. నిజంగానే అంత సీన్ ఉందా?

రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటోంది. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త నానాటికీ పెరుగుతోంద‌నే నిష్టుర స‌త్యాలు పార్టీని క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో యుద్ధ ప్రాతిప‌దిక‌న ఈ వ్య‌తిరేక‌త‌ను త‌గ్గిం చుకుని పార్టీని పుంజుకునేలా చేయాల‌ని పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జిల్లాల ఏర్పాటుకు స‌న్నాహాలు ప్రారంభించారు. ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాల‌ను పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల ఆధారంగా పాతిక జిల్లాలు చేస్తాన‌ని, అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తాన‌ని.. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. అనుకున్న విధంగానే ఆయ‌న ప‌నులు ప్రారంభించారు.

అయితే.. అర‌కు వంటి అతి పెద్ది గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని రెండు జిల్లాలుగా విభ‌జించాల‌న్న పార్టీ నేత‌ల డిమాండ్‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న మొత్తం 26 జిల్లాల‌ను ఏర్పాటు చేసేందుకు అడుగులు ముందుకు వేశారు. ఇప్పుడు ఇది కూడా కాదు.. ఆదోని స‌హా అమ‌రావ‌తి వంటి జిల్లాల‌ను కూడా ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. వీటితో క‌లిపి.. మొత్తం జిల్లాల సంఖ్య 32గా ఉంటుంద‌ని అంటున్నారు. వాస్త‌వానికి జిల్లాల ప్ర‌క్రియ వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న జ‌నాభా గ‌ణ‌న త‌ర్వాతే చేయాల‌ని కేంద్రం ఇదివ‌ర‌లోనే రాష్ట్రానికి స్ప‌ష్టం చేసింది. దీంతో కొన్నాళ్లు ఈ ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వం వాయిదా వేసుకుంది.

ఇంతలో.. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌, పోల‌వ‌రం విఫ‌లం, కేంద్రం నుంచి నిధులు రాబ‌ట్టలేని ప‌రిస్థితి. మ‌రోవైపు నేత‌ల దూకుడు, పుంజుకుంటున్న ప్ర‌తిప‌క్షం టీడీపీ వంటివి వైసీపీని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్నాయి. దీంతో కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసి.. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చాల‌నే వ్యూహంతో జ‌గ‌న్ వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది నిర్వ‌హించిన జ‌నాభా గ‌ణన‌‌ను కేంద్రం వాయిదా వేయ‌నుంది. దీంతో కేంద్రం నుంచి ప్ర‌త్యేక అనుమ‌తి తెచ్చుకున్న జ‌గ‌న్‌.. జిల్లాల ఏర్పాటు దిశ‌గా అడుగులు వేశారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి తొలి వారంలో దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నుంది.

అయితే, ఇప్పుడున్న వ్య‌తిరేక‌త కేవ‌లం జిల్లాల ఏర్పాటుతో పోతుందా? పార్టీ పుంజుకుంటుందా? అనేది మాత్రం మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా ఉంది. గ‌తంలో తెలంగాణ‌లోనూ అక్క‌డి కేసీఆర్ స‌ర్కారు జిల్లాల విభ‌జ‌న చేప‌ట్టి.. 10 జిల్లాల‌ను 33 వ‌ర‌కు పెంచింది. కీల‌క తెలంగాణ యోధుల పేర్ల‌ను కూడా పెట్టింది. అయితే.. ఆశించిన మేర‌కు ప్ర‌జ‌ల్లో ఊపు రాక‌పోగా.. జిల్లాల ఏర్పాటు ప్ర‌భుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు తెచ్చింది. ఉన్న‌త‌స్థాయి అధికారులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల ఏర్పాటు, అభివృద్ధి నిధుల‌ను కేటాయించ‌డం వంటివి స‌ర్కారుకు తీవ్ర త‌ల‌నొప్పులు తెచ్చింది.

ఇంతా చేస్తే.. 2018 ఎన్నిక‌ల్లో కేసీఆర్ స‌ర్కారు భారీ పోరు చేస్తే.. త‌ప్ప ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కలేక పోయింది. సో.. ఈ పాఠం నుంచి వైసీపీ స‌ర్కారు చాలానే నేర్చుకోవ‌చ్చ‌న్న‌ది.. నిపుణుల మాట‌. ఇప్పుడు ఆర్థికంగా ఎదుర‌వుతున్న ఇబ్బందులు జ‌గ‌న్ స‌ర్కారుకు మ‌రిన్ని పెరుగుతాయ‌ని చెబుతున్నారు. పైగా ప్ర‌జ‌ల్లో పార్టీ పుంజుకోవ‌డం అనేది జిల్లాల ఏర్పాటుతో సాధ్యం కాద‌ని.. నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం, దూకుడు త‌గ్గించ‌డ‌మే కీల‌క‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.