ఈనేత పక్క చూపులు చూస్తున్నారా ?

పార్టీలో ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలో ఇపుడిదే చర్చ నడుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన ఈ మాజీ ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు @ మాగంటి బాబు ఇప్పుడెక్కడా కనబడటం లేదట. పార్టీ కార్యక్రమాల్లో మాజీ ఎంపి కనబడటం లేదంటే సరేలే అని సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ చంద్రబాబునాయుడు దగ్గర కూడా కనబడటం లేదట. జిల్లాలోని మాజీ మంత్రులు, సీనియర్ నేతలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారు కానీ ఈయనగారు మాత్రం ఎక్కడ అడ్రస్ ఉండటం లేదనే టాక్ పెరిగిపోతోంది.

అయితే ఇదే సమయంలో మాజీ ఎంపి అనుచరులు ఎదురుదాడి మొదలుపెట్టారు. తమ నేతను చంద్రబాబే దూరంగా పెట్టేశారు కాబట్టే తమ నేత కూడా ఏమి చేయలేక మౌనంగా ఉండిపోతున్నారని చెబుతున్నారు. రెండు వాదనల్లో ఏది నిజమో తెలియాలంటే ఇటు చంద్రబాబు కానీ లేకపోతే అటు మాగంటి బాబు కానీ ఎవరో ఒకరు నోరిప్పాల్సిందే. విషయం ఏమైనా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనేది వాస్తవం. ఎందుకంటే ఏలూరు పార్లమెంటు నియజకవర్గం అధ్యక్షునిగా అందరు మాగంటి బాబును నియమిస్తారని అనుకున్నారు. కానీ చంద్రబాబు మాత్రం మాజీ ఎంఎల్ఏ గన్ని వీరాంజనేయులుని నియమించారు.

చంద్రబాబు చేసిన నియామకంతో ముందు అందరు ఆశ్చర్యపోయారు. తర్వాత అధినేతకు, తమ నేతకు గ్యాప్ వచ్చింది నిజమే అనే నిర్ధారణకు వచ్చారు. లేకపోతే మాజీ ఎంపి అందులోను పార్టీకి లాయల్ నేతగా పేరుతెచ్చుకున్న మాగంటిని కాదని చంద్రబాబు వేరొకళకి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు చేసిన పని కారణంగా మాగంటి పార్టీకి దూరంగానే ఉంటున్నారట.

దాంతో ప్రత్యామ్నాయంగా ఏమి చేయాలనే విషయమై మాగంటి తన మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఒకవేళ టీడీపీని వదిలేస్తే ఏ పార్టీలో చేరాలి ? అన్నదే ప్రధాన ప్రశ్నగా వినిపిస్తోందట. బీజేపీలో చేరితే పెద్దగా ఉపయోగం ఉండదన్న ఆలోచనలో మాగంటి ఇఫ్పటికే ఉన్నారట. ఇక మిగిలిన ఆప్షన్ కూడా వైసీపీ తప్ప మరోటి కనబడటం లేదు. అయితే అదికార పార్టీలో చేరితే తనకు గౌరవం ఉంటుందా ? అన్నదే అనుమానమట. మరి ఏ పార్టీలో చేరాలనే విషయమై తొందరలోనే మాగంటి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అనుచరులు చెప్పుకుంటున్నారు. చూద్దాం మాగంటి ఏమి నిర్ణయం తీసుకుంటారో ?