నితీష్ కుమార్ షాకింగ్ యూ టర్న్ !

బీహార్ ముఖ్యమంత్రి, సిఎం అభ్యర్ది నితీష్ కుమార్ కూడా నాలుక మడతేసి యూటర్న్ తీసేసుకున్నారు. తాను కూడా సగటు రాజకీయ నేతనే అని నిరూపించుకున్నారు.  బీహార్ మూడో దశ ఎన్నికల ప్రచార సభ ముగింపులో మాట్లాడుతూ ఇవే తనకు చివరి ఎన్నికలంటు చేసిన ప్రకటన బీహార్లో సంచలనం సృష్టించింది. మొదటి రెండు దశల్లోను వెనకబడిన ఎన్డీయే కూటమి మూడో దశలో అయినా పుంజుకునేందుకే నీతీష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుమానలు అప్పట్లోనే వచ్చాయి.

దానికి తగ్గట్లే కూటమి గెలిచిన తర్వాత ఇపుడు నితీష్ అలాగే మాట్లాడటం ఆశ్చర్యమేసింది. ఇవే తనకు చివరి ఎన్నికలన్న తన ప్రకటనను జనాలే తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ ఇఫుడు చల్లగా చెబుతున్నారు. చివరి ఎన్నికలంటే తన అర్ధం ప్రచారంలో చివరి ఎన్నికని అర్ధమంటు చక్కగా వివరించారు మీడియాకు. చివరి ఎన్నికల ప్రకటన విషయంలో నితీష్ తాజాగా ఇఛ్చిన వివరణ అచ్చంగా ‘అశ్వత్ధామ అతః కుంజరహ’ అని మహాభారతంలో ధర్మారాజు చెప్పినట్లే ఉంది.

కురుక్షేత్ర యుద్ధంలో కూడా ధర్మరాజు అశ్వత్థామ అతః అని అందరికీ ముఖ్యంగా ద్రోణాచార్యునికి వినబడేట్లుగా అరచి కుంజరహ అని ఎవరికీ వినబడకుండా చెబుతాడు. అలాగే ఉంది ఇపుడు నితీష్ చెప్పిన వివరణ కూడా. బహుశా మొన్నటి ఎన్నికల్లో ఎన్డీయూ కూటమి గనుక ఓడిపోయుంటే నితీష్ తన ప్రకటనకు కట్టబడుండే వారేమో. అయితే ఎవరు ఊహించని రీతిలో గెలుపు గుర్రం ఎక్కటంతో  నాలుకను మడతేశారు. పైగా  తన ప్రకటనను జనాలే తప్పుగా అర్ధం చేసుకున్నారంటు చెప్పటమే విచిత్రంగా ఉంది.