చిరంజీవి పట్టుకున్నాడు.. మిగతా వాళ్ల సంగతేంటి?

మెగాస్టార్ చిరంజీవి కరోనా కథ అనూహ్య మలుపు తిరిగింది. నాలుగు రోజుల కిందట తనకు కరోనా వచ్చినట్లు ప్రకటించిన చిరు.. ఇప్పుడు అది నిజం కాదని తేల్చాడు. తనకు అసలేమాత్రం కరోనా లక్షణాలు లేకపోవడంతో తిరిగి వేర్వేరు మార్గాల్లో పరీక్షలు చేయిస్తే.. తనకు కరోనా నెగెటివే వచ్చిందని.. మొదట తాను పరీక్షకు వినియోగించిన కరోనా కిట్‌లో లోపం ఉందని తేలిందని.. తనకసలు కరోనా సోకకున్నా అది వైరస్ ఉన్నట్లు చూపించిందని చిరు స్పష్టం చేశాడు. ఈ సమాచారం అందరినీ విస్మయానికి గురి చేసింది.

కరోనా సోకినట్లు వెల్లడించడానికి ముందు చిరు.. మాస్కుల్లేకుండా అక్కడా ఇక్కడా తిరిగేసిన ఫొటోలు పెట్టి ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేశారు జనాలు. ఆయనకు కరోనా లేకున్నప్పటికీ అలా చేయడం తప్పే కానీ.. కరోనా పాజిటివ్ అని చెప్పడం వల్ల చిరు విపరీతంగా ట్రోల్‌కు గురయ్యాడు.

ఆ సంగతలా వదిలేస్తే కరోనా కిట్‌లలో లోపాల గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ర్యాపిడ్ కిట్ల కచ్చితత్వంపై ముందు నుంచి సందేహాలున్నాయి. కరోనా లేని వారికి ఉన్నట్లు, ఉన్నవారికి లేనట్లు చూపిస్తున్నాయన్నది వీటి మీద వచ్చిన విమర్శ. ఇప్పుడు చిరంజీవి కాబట్టి అనుమానంతో వేర్వేరు మార్గాల్లో మళ్లీ పరీక్ష చేయించుకున్నాడు. తన కోడలి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే అపోలో హాస్పిటల్లో ఒక బృందమే ఆయన కోసం పని చేసింది. సీటీ స్కాన్ ద్వారా, కచ్చితమైన కరోనా పరీక్షల ద్వారా ఆయనకు వైరస్ సోకలేదని నిర్ధరించింది.

కానీ ఆ స్థానంలో ఒక సామాన్యుడు ఉంటే ఏంటన్నది ప్రశ్న. కరోనా లేకున్నా ఉన్నట్లు చూపితే, ఉన్నా లేనట్లు చూపిస్తే పరిస్థితి ఏంటి? కరోనా ఆరోగ్య పరంగానే కాక సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా జనాలపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తోందో తెలిసిందే. అలాంటపుడు ఇలా తప్పుడు ఫలితాలు రావడంతో జరిగే నష్టమెలాంటిదన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో కరోనా కిట్ల కచ్చితత్వంపై రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.