చిరాగ్… పవర్ స్టార్… ఒకటేనా

అవును వీళ్ళద్దరు సేమ్ టు సేమ్ అనే అనిపిస్తోంది. ఒకళ్ళేమో ఏపిలోని జనసేన అధినేత పవన్ కల్యాణ్. మరొకరేమో బీహార్ లోని ఎల్జీపీ అధినేత చిరాగ్ పాశ్వాన్. ఎక్కడో బీహార్లో ఉన్న చిరాగ్ ఇంకెక్కడో ఉన్న పవన్ కు ఏమిటి పోలిక అనే డౌట్ వస్తోంది. ఇద్దరు వారసులుగానే రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఇద్దరు మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. ఇద్దరు ఒకేలాగ దెబ్బతిన్నారు. కాకపోతే ఇద్దరిలో చిన్న తేడా ఉంది. అదేమిటంటే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్ ఘోరంగా రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. చిరాగ్ ఎన్నికల్లో పోటీ చేయలేదంతే తేడా.

ముందు బీహార్ ఎన్నికలతో మొదలుపెడితే దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్. వారసుడి హోదాలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకుముందు హీరోగా ఓ సినిమాలో నటించారు. సినిమాల్లోనే సెటిలైపోదామని అనుకుంటే సాధ్యం కాలేదు. మొదటి సినిమానే దారుణంగా ఫెయిల్ అవ్వటంతో తర్వాత మరెవరు ధైర్యం చేసి చిరాగ్ ను హీరోగా పెట్టి సినిమాలు తీయలేదు. దాంతో వేరే దారిలేక చివరకు రాజకీయాల్లోకి వచ్చేశారు. రామ్ విలాస్ కేంద్రమంత్రిగా ఢిల్లీలో బిజీగా ఉండటం వల్ల పార్టీకి చిరాగ్ నే అధ్యక్షుడిగా చేసేశారు.

సరిగ్గా ఎన్నికలకు ముందు హఠాత్తుగా రామ్ విలాస్ మరణించారు. దాంతో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం మొత్తం చిరాగ్ మీదే పడింది. దానికితోడు అప్పటికే తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకోవటంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద వ్యతిరేకత కారణంగా ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చేశారు. 243 అసెంబ్లీ సీట్లకు పోటీ చేశారు. అన్నీ సీట్లలో గెలిచింది మాత్రం కేవలం ఒకే ఒక్క సీటులో. మొత్తం మీద సుమారు 5 శాతం ఓట్లొచ్చాయి. తాను ఎంపి కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎల్జేపీ గెలిస్తే సిఎం అయిపోదామని అనుకున్నారు.

ఇక ఏపికి వస్తే జనసేన అధినేతగా పవన్ మొదటిసారి 2019లోనే ఎన్నికల్లోకి దిగారు. పవన్ నేపధ్యం కూడా సినిమాలే. తాను కూడా మెగాస్టార్ చిరంజీవి వారసునిగానే రాజకీయాల్లోకి వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో సుమారు 135 నియోజకవర్గాల్లో పోటీ చేసినా గెలిచింది మాత్రం ఒకే ఒక్క సీటులో. తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాలు రెండింటిలోను ఓడిపోయారు. జనసేనకు వచ్చింది కూడా సుమారు 5 శాతం ఓట్లే.

ఎన్నికల్లో పోటీ చేయటంలో ఇటు చిరాగ్ అటు పవన్ టార్గెట్ ఒక్కటే. నితీష్ ఓటమే ధ్యేయంగా చిరాగ్ పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఓటమే ధ్యేయంగా పవన్ పోటీ చేశారు. జేడీయు అధ్యక్షునిగా నితీష్ దెబ్బతిన్నా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇక ఏపిలో జగన్ను దెబ్బ కొట్టడమే ధ్యేయంగా పోటీ చేసినా సక్సెస్ కాలేకపోయారు. జనసేన తరపున గెలిచిన ఎంఎల్ఏ జగన్ కే జై కొడుతున్నారు. మరి ఎల్జేపీ తరపున గెలిచిన ఎంఎల్ఏ ఏమి చేస్తారో చూడాలి. ఇఫ్పుడు చెప్పండి బీహార్లో ఉన్న చిరాగ్, ఏపిలో ఉన్న పవన్ ఇద్దరు సేమ్ టు సేమా కాదా ?