మోహన్ లాల్ ఐపీఎల్ టీం ఓనర్ కాబోతున్నాడా?

కరోనా టైంలో ఎన్నో సందేహాల మధ్య యూఏఈలో నెలన్నర కిందట మొదలైన ఐపీఎల్.. ఆ సందేహాలన్నింటినీ పటా పంచలు చేస్తూ సూపర్ హిట్టయింది. ఐపీఎల్‌కు ఎప్పుడూ గొప్ప ఆదరణ ఉంటుంది కానీ.. గత సీజన్లన్నింటినీ మించిపోయే ఆదరణ ఈసారి దక్కింది. కరోనా ధాటికి అల్లాడిపోయి, అలసిపోయి ఉన్న జనాలకు ఈ టోర్నీ గొప్ప ఉపశమనంగా పని చేసింది.

ఇండియాలో జరగలేదు, స్టేడియాల్లో ప్రేక్షకులు లేరన్న మాటే కానీ.. వినోదానికి ఏమాత్రం ఢోకా లేకపోయింది. గత సీజన్లతో పోలిస్తే ఎంటర్టైన్మెంట్ ఇంకా పెరిగింది. మామూలుగా జరిగే దాని కంటే ఐదు నెలలు ఆలస్యంగా టోర్నీ జరగడంతో.. తర్వాతి ఐపీఎల్ ఇంకో ఐదు నెలల్లోనే వచ్చేస్తోంది. ఈసారి లీగ్ ఇండియాలోనే జరిగే సూచనలుండగా.. దానికి ఆకర్షణ మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్‌లోకి కొత్తగా మరో జట్టును తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. కొన్నేళ్లుగా ప్రచారంలో ఉన్న సంగతి నిజమయ్యేలా ఉంది. అహ్మదాబాద్ కేంద్రంగా కొత్త ఫ్రాంఛైజీని వచ్చే సీజన్‌లోనే ఆరంభించే అవకాశముంది. దీని కోసం త్వరలోనే బిడ్డింగ్ ప్రక్రియ మొదలుపెడతారంటున్నారు. ఈ జట్టును సొంతం చేసుకునేందుకు బిగ్ షాట్స్ రంగంలోకి దిగుతున్నారు. అందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒకడన్నది తాజా కబురు.

ఎడ్యుకేషన్ లెర్నింగ్ యాప్ బైజూస్ సంస్థతో కలిసి మోహన్ లాల్ ఈ జట్టును కొనాలనుకుంటున్నాడట. రెండు రోజుల కిందట జరిగిన ఐపీఎల్ ఫైనల్‌ను దుబాయ్‌కి వెళ్లి లాల్, బైజూస్ అధినేత స్వయంగా వీక్షించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫ్రాంఛైజీకి సంబంధించి సన్నాహాల్లో భాగంగా, బీసీసీఐ టీంతో మాట్లాడేందుకే లాల్ అక్కడికి వెళ్లాడట.

ఇంతకుముందు కేరళ కేంద్రంగా ఒక ఐపీఎల్ ఫ్రాంఛైజీ రావడం, కొన్ని కారణాలతో మూత పడటం తెలిసిన సంగతే. ఐతే కేరళతో పోలిస్తే గుజరాత్‌లో ఫ్రాంఛైజీని సక్సెస్ కావడానికి అవకాశముంది. అది ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం. పైగా అక్కడ లక్షా 25 వేల కెపాసిటీతో ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియాన్ని ఈ ఏడాదే మొదలుపెట్టారు. గుజరాత్‌లో క్రికెట్ పిచ్చీ తక్కువేమీ కాదు. మోడీ రాష్ట్రంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీని పెడితే దాన్ని ఆటోమేటిగ్గా సక్సెస్ చేస్తారు. మరి నిజంగానే మోహన్ లాల్ ఈ జట్టును సొంతం చేసుకుంటాడేమో చూడాలి.