పీవీఆర్ థియేటర్స్.. 973 కోట్ల నుంచి 40 కోట్లకు

లాక్ డౌన్ దెబ్బకు అల్లాడిపోయిన రంగాల్లో సినీ పరిశ్రమ ఒకటి. అందులోనూ ఆ రంగంలో అత్యధిక ఆదాయానికి కేంద్ర బిందువైన థియేటర్ల పరిశ్రమ కరోనా వల్ల దారుణంగా దెబ్బ తింది. సినిమాల మీద ఆధారపడ్డ మిగతా వాళ్లందరూ మళ్లీ పని మొదలుపెట్టారు కానీ.. థియేటర్లను నమ్ముకున్న వాళ్లకు మాత్రం ఇప్పటికీ ఉపాధి లేదు. గత నెలలో థియేటర్ల పున:ప్రారంభానికి అనుమతులు వచ్చినప్పటికీ దేశవ్యాప్తంగా పది శాతం థియేటర్లు కూడా తెరుచుకోలేదు.

థియేటర్లు మళ్లీ ఎప్పటికీ సాధారణ స్థాయిలో నడుస్తాయో తెలియట్లేదు. ఈ రంగం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు నష్టపోయింది. మరింత నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేలా ఉంది. దేశంలోనే అతి పెద్ద థియేట్రికల్ చైన్ అయిన పీవీఆర్ సంస్థ ఈ ఏడాది మూడో క్వార్టర్‌కు సంబంధించి తాజాగా విడుదల చేసిన లాభ నష్టాల లెక్కలు చూస్తే థియేటర్ల పరిస్థితి ఏంటో అర్థమవుతుంది.

అన్ని థియేట్రికల్ ఛైన్స్ లాగే ఈ ఏడాది తొలి క్వార్టర్లో మంచి ఆదాయం అందుకున్న పీవీఆర్.. రెండో క్వార్టర్లో దారుణంగా దెబ్బ తింది. మూడో క్వార్టర్‌లో మరింతగా సంస్థ పతనం అయింది. గత మూడు నెలలకు గాను ఆదాయం లేకపోగా రూ.184 కోట్ల నష్టం వాటిల్లిందట పీవీఆర్‌కు. థియేటర్ల మెయింటైనెన్స్, సిబ్బందికి ఇస్తున్న అరకొర జీతాలు లెక్క వేసినా ఇంత మొత్తంలో నష్టం వాటిల్లింది.

గత ఏడాది ఇదే క్వార్టర్లో ఆ సంస్థ రూ.48 కోట్లు లాభాలు అందుకుంది. గత నెల 15న థియేటర్లు తెరవడం వల్ల గత రెండు వారాల్లో కొంత మేర ఆదాయం వచ్చింది. కానీ ఆ మొత్తం థియేటర్ల మెయింటైనెన్స్‌కు కూడా సరిపోని పరిస్థితి. గత ఏడాది సెప్టెంబరు 30 నాటికి పీవీఆర్ నికర ఆదాయం రూ.973 కోట్లుగా ఉండగా.. ఈసారి అది రూ.40 కోట్లకు పడిపోయింది. మిగతా మల్టీప్లెక్సుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.