పవన్‍కళ్యాణ్‍కి మరో సమస్య

పవన్‍కళ్యాణ్‍ ‘వకీల్‍ సాబ్‍’ తర్వాత చేసేది ‘అయ్యప్పనుమ్‍ కోశియుమ్‍’ రీమేకే. ఈ రీమేక్‍ కథని పవన్‍కళ్యాణ్‍ ఇమేజ్‍కి అనుగుణంగా దర్శకుడు సాగర్‍ చంద్ర మార్చేసాడట. అయితే ఇందులో నటించే మరో హీరో ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. వకీల్‍ సాబ్‍ షూటింగ్‍ పూర్తయ్యే సరికి ప్రీ ప్రొడక్షన్‍ మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఇదిలావుంటే ఈ చిత్రంలో పవన్‍ సరసన నటించే హీరోయిన్‍ ఎవరనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

ఎందుకంటే ఇది పూర్తిగా హీరోల సినిమా. కేవలం హీరోలు నువ్వా నేనా అన్నట్టు పోటీలు పడుతుంటారు. దాంతో హీరోయిన్ల పాత్రలకు అంతగా ప్రాధాన్యత వుండదు. అందుకే మలయాళంలో హీరోయిన్లను కాకుండా క్యారెక్టర్‍ ఆర్టిస్టుల లాంటి వాళ్లతో తీసేసారు. కానీ పవన్‍ కళ్యాణ్‍ సినిమాలో అలా చేయడానికి కుదరదు. అలా అని పవన్‍ పక్కన నటించే అవకాశం వచ్చినా కానీ అసలు ప్రాధాన్యతే లేని పాత్రను ఎవరు పోషిస్తారు. గట్టిగా వారం రోజుల కాల్షీట్లు అవసరం లేని పాత్రకోసం నిర్మాతలు మాత్రం ఎంతని వెచ్చిస్తారు? అందుకే పవన్‍ సరసన నటించేదెవరనేది ఇప్పుడు నిర్మాతలకు పెద్ద సవాల్‍గా మారింది.

సాయి పల్లవి పేరు వినిపిస్తోంది కానీ ఆమె నటించే అవకాశాలు తక్కువే. వేదళాం రీమేక్‍లో చిరంజీవి చెల్లెలిగా నటించడానికి కూడా ఆమె కాదనడంతో కీర్తి సురేష్‍ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటిది అసలు ఇంపార్టెన్సే లేని పాత్రను ఎందుకు చేస్తుంది?