టీవీ5మూర్తి అరెస్టుకు రంగం సిద్ధం?

Tv5 Murthy
Tv5 Murthy

అంద‌రూ క‌రోనా గురించే చ‌ర్చించుకుంటున్న స‌మ‌యంలో ఆంద్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. టీవీ-5 న్యూస్ ఛానెల్ ముఖ చిత్రం అన‌ద‌గ్గ అగ్ర‌శ్రేణి తెలుగు న్యూస్ యాంక‌ర్ మూర్తిని అరెస్టు చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కారు రంగం సిద్ధం చేసింది. ఆయ‌న్ని అరెస్టు చేసేందుకు ప్ర‌త్యేక సీఐడీ బృందాన్ని ఏర్పాటు చుఏసింది. ఈ బృందం మూర్తిని అరెస్టు చేసేందుకు హైద‌రాబాద్ బ‌య‌ల్దేరిన‌ట్లు స‌మాచారం.

జ‌గ‌న్ స‌ర్కారు అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించాల‌ని నిర్ణ‌యించిన‌ప్ప‌ట్నుంచి టీవీ 5 ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. అమ‌రావ‌తి ఉద్య‌మానికి విస్తృత‌మైన క‌వ‌రేజీ ఇస్తోంది. అక్క‌డి రైతుల గోడును ప్ర‌పంచానికి తెలియ‌జేస్తోంది. ఇక గ‌త ఏడాది కాలంలో జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న అనేక వివాదాస్ప‌ద నిర్ణ‌యాల‌పై టీవీ 5 నిల‌దీస్తూనే ఉంది. వ్య‌తిరేక క‌థ‌నాలు ప్ర‌సారం చేస్తూనే ఉంది. క‌రోనా వేళ జ‌గ‌న్ స‌ర్కారు వైఫ‌ల్యాల‌న్నింటినీ ఆ ఛానెల్ ఎండ‌గ‌డుతోంది.

సంబంధిత చ‌ర్చా కార్య‌క్ర‌మాల‌న్నింటినీ మూర్తినే న‌డిపిస్తున్నారు. ఇటీవ‌ల కొన్ని కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న ప్ర‌భుత్వ తీరును తూర్పార‌బ‌ట్టారు. ఐతే మూర్తి వైద్యుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించార‌ని.. వారికి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు ప్ర‌సారం చేయించార‌ని ప్ర‌భుత్వం అంటోంది.

ఈ కార‌ణంతోనే ఆయ‌న అరెస్టుకు రంగం సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఐతే ఈ సంక్షోభ స‌మ‌యంలో ఓ టాప్ న్యూస్ యాంక‌ర్‌ను టార్గెట్ చేస్తే జ‌గ‌న్ స‌ర్కారు విమ‌ర్శ‌ల పాల‌వ‌డం ఖాయం. మ‌రి ఈ విష‌యంలో ఎలా ముందుకెళ్తుందో చూడాలి.