సాహో అక్కడా డిజాస్టరే..

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’పై ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో సినిమా పూర్తిగా విఫలమైంది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. విడుదలకు ముందు ఉన్న హైప్ వల్ల భారీగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. వీకెండ్ తర్వాత సినిమా నిలబడలేదు. ఆ తర్వాత అమేజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమాకు అక్కడా ఆశించిన స్పందన లేనట్లే కనిపించింది. ఈ సినిమాను ఇప్పుడు టీవీలో రిలీజ్ చేస్తే ఇక్కడా చేదు అనుభవమే ఎదురైంది. కేవలం 5.8 టీఆర్పీ రేటింగ్‌తో ‘సాహో’ టీవీ ప్రిమియర్ తుస్సుమనిపించింది.

కొత్త సినిమాను వేడి మీద టీవీల్లో రిలీజ్ చేస్తే అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది కానీ.. ఏడాది తర్వాత, అది కూడా ఒక డిజాస్టర్ సినిమాను టీవీలో రిలీజ్ చేస్తే జనాలకు ఏం ఆసక్తి ఉంటుంది. లాక్ డౌన్ మొదలైన కొత్తలో అయితే సినిమా ఎలాంటిదైనా విరగబడి చూశారు జనం. కానీ ఇప్పుడు టీవీల్లో ప్రిమియర్స్‌గా పడుతున్న సినిమాలకు ఆశించిన రెస్పాన్స్ ఉండట్లేదు. ఈ క్రమంలోనే ‘సాహో’కు మరీ లో రేటింగ్స్ వచ్చాయి. దీంతో పోలిస్తే కార్తికేయ సినిమా ‘గుణ 369’కు ఎక్కువ రేటింగ్ రావడం గమనార్హం.

టీవీల్లో సినిమాలు చూసేది ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్సే. ఆ తరహా ప్రేక్షకులకు ‘సాహో’ అసలేమాత్రం ఎక్కే సినిమా కాదు. పైగా టీవీ ప్రిమియర్ వేయడానికి ఇంతగా ఎందుకు ఆలస్యం చేశారో ఏంటో మరి. రిలీజైన 15 నెలలకు సినిమాను టీవీలో వేస్తూ దాని గురించి తెగ ప్రచారం చేశారు. స్వయంగా ప్రభాస్ సైతం టీవీ ప్రిమియర్ గురించి ప్రమోట్ చేశాడు. అయినా సరే.. అభిమానులు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ఓటీటీల దెబ్బకు అసలే శాటిలైట్ మార్కెట్ దెబ్బ తింటున్న నేపథ్యంలో కొత్త సినిమాల ప్రిమియర్ల విషయంలో కొంచెం జాగ్రత్తగా అడుగులేయాల్సిందే.