10 లక్షల లంచానికి రూ. 145 కోట్ల ఫైన్

అవినీతిని అరికట్టే విషయంలో అమెరికాలో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఓ ఉన్నతాధికారికి రూ. 10 లక్షలు లంచం ఇచ్చారనే ఆరోపణలు నిజమని తేలటంతో ఓ కంపెనీకి రూ. 145 కోట్లు జరిమానా విధించింది అక్కడి కోర్టు. ఇంతకీ విషయం ఏమిటంటే అగ్రరాజ్యం అమెరికాలోని చికాగోలో బీమ్ గ్లోబల్ స్పిరిట్స్, అండ్ వైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మద్యం తయారీ కంపెనీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తులను ఈ కంపెనీ అమ్ముతుంటుంది. వైన్ తయారు చేసి అమ్మటమే ఈ కంపెనీ ప్రధాన వ్యాపకం.

వైన్ తయారీలో భాగంగా ఈ కంపెనీకి మనదేశం రాజస్ధాన్ లో అల్వార్ జిల్లాలోని బెహర్ రోల్ ప్రాంతంలో ఓ ఉత్పత్తి యూనిట్ ఉంది. ఈ యూనిట్ తరపున వైన్ తయారు చేయటానికి అవసరమైన లైసెన్సులు, అమ్మకాలకు అనుమతులు తదితరాల కోసం ఓ ఉన్నతాధికారికి భారీ ఎత్తున లంచం ఇచ్చిందట. అంటే 2006-12 మధ్య కాలంలో సదరు ఉన్నతాధికారికి అమెరికా కంపెనీ రూ. 10 లక్షలు లంచం ఇచ్చినట్లు బయటపడింది. ఇదే కాకుండా డిస్ట్రిబ్యూటర్లు, సేల్స్ ప్రమోటర్లు లాంటి వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు బాగానే ముట్టచెప్పిందట. ఇదంతా కంపెనీ హెడ్ ఆఫీసులోని అకౌంట్స్ పుస్తకాల్లో జాగ్రత్తగా రికార్డు చేసింది.

ఇదే విషయం ఎలాగో బయటకుపొక్కటంతో కంపెనీ మీద చికాగోలో కేసు నమోదైంది. కేసు కోర్టులో విచారణ జరిగినపుడు అన్నీ విషయాలు బయటకు వచ్చాయి. తాము భారత్ లో ఉన్నతాధికారికి లంచం ఇచ్చింది వాస్తవమే అని కంపెనీ యాజమాన్యం కూడా అంగీకరించింది. వ్యాపార అభివృద్ధికోసం లంచాలు ఇవ్వటం తప్పని తెలిసినా కంపెనీ లాయర్లు కూడా యాజమాన్యం చర్యలను తొక్కిపెట్టారని క్రమినల్ విభాగం అటార్నీలు నిరూపించారు.

దాంతో కేసు విచారణ పూర్తయిన తర్వాత సంబంధిత ఉద్యోగులను, లాయర్లను విధుల నుండి తొలగించాలని కోర్టు తీర్పు చెప్పింది. పనిలో పనిగా వ్యాపారాభివృద్ధి కోసం అడ్డదారులు తొక్కి లంచం ఇచ్చినందుకు కంపెనీకి ఫానెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ చట్టం కింద కోర్టు ఆ కంపెనీకి రూ. 145 కోట్లు ఫైన్ వేసింది. అయితే తాము చేసింది తప్పేనని ఒప్పుకుంటు కంపెనీ ఫైన్ కట్టడానికి రెడీ అయిపోయింది. వివిధ కారణాల వల్ల లంచం తీసుకున్న భారత ఉన్నతాధికారి పేరును బయట పెట్టడం లేదని కోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి లంచం తీసుకున్నది భారత అధికారైతే రూ. 145 కట్ల ఫైన్ పడింది అమెరికా కంపెనీకి.