ఇండియాలో ఓటీటీ పవర్ ఇదీ..

ఓటీటీ విప్లవం ఇండియాలో కొంచెం ఆలస్యంగానే మొదలైందని చెప్పొచ్చు. గత కొన్నేళ్లలో ఓటీటీలకు ఇండియాలో ఆదరణ కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుండగా.. కరోనా వల్ల అమలైన లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా అది ఊపందుకుంది. గత కొన్ని నెలల్లో అన్ని ఓటీటీలకూ ఇండియాలో డిమాండ్ పెరిగింది. కోట్లల్లో కొత్త సబ్‌స్క్రైబర్లు తయారయ్యారు. కేవలం తెలుగులో మాత్రమే, పరిమితంగా కంటెంట్ అందించే ‘ఆహా’ లాంటి ఓటీటీకి కూడా మంచి డిమాండే ఏర్పడింది.

ఐతే ఇప్పుడు చూస్తున్నది కొంతే అని.. రాబోయే కొన్నేళ్లలో ఇండియాలో ఓటీటీ స్థాయి మరింతగా పెరగనుందని నిపుణులు అంటున్నారు. ఓటీటీ వీక్షకుల పరంగా భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్‌లో ఒకటి కాబోతోందని ఒక అధ్యయనంలో తేలింది.

ప్రస్తుతం అత్యధిక ఓటీటీ వీక్షకులున్న దేశాల జాబితాలో దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉండగా.. 2024 నాటికి ఆ దేశాల్ని అధిగమించి ఇండియా నంబర్ వన్ అవుతుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదక అంచనా వేసింది. ఫిలిం ఇండస్ట్రీ ఆదాయాన్ని సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ నడిపించనుందని.. 2019లో దీని ద్వారా 708 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5200 కోట్లు) ఆదాయం రాగా.. ఏటా 30.7 శాతం వృద్ధితో 2024 నాటికి ఈ మొత్తం 2.7 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.20 వేల కోట్లు) చేరబోతోందని ఈ నివేదికలో పేర్కొన్నారు.

భారత్‌లో మీడియా, వినోద రంగం ఏటా పది శాతానికి పైగా వృద్ధితో సాగి 2024 నాటికి 54 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.4.1 లక్షల కోట్లే) చేరబోతుండగా.. అందులో ఓటీటీ వీడియో విభాగం వాటా 5.2 శాతం, అంటే రూ.20 వేల కోట్ల దాకా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. థియేటర్లు భారీగా మూతపడబోతుండటం, స్టూడియోలు ఓటీటీలే లక్ష్యంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీసే ఒరవడి పెరగనున్న నేపథ్యంలో ఓటీటీల జోరు భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.