పార్టీ మారి ఈ మాజీ మంత్రి తప్పు చేశారా ?

అవుననే అంటున్నారు మద్దతుదారులు. కడప జిల్లాలోని జమ్మలమడుగులో కీలక నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి విషయం ఇపుడు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. జమ్మలమడుగు అంటేనే అందరికీ ముందు ఫ్యాక్షన్ రాజకీయాలే గుర్తుకొస్తాయి. ఇటువంటి నియోజకవర్గంలో తిరుగులేని నేతగా టీడీపీలో బాగా పాపులరయ్యారు రామసుబ్బారెడ్డి. 2004 నుండి వరుసగా 2014 వరకు మూడుసార్లు పోటి చేసి ఓడిపోయినా పార్టీపై ఆధిపత్యానికైతే ఎదురులేకుండా పోయింది.

అలాంటిది మొదటిసారి 2014లో ఈ మాజీ మంత్రి ఆధిపత్యానికి బ్రేకులు పడ్డాయి. 2014లో వైసీపీ తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు టీడీపీలోకి లాక్కుని మంత్రిని చేయటంతో రామసుబ్బారెడ్డికి సమస్యలు మొదలయ్యాయి. అప్పటి వరకు బద్ద శతృవులుగా ఉన్న ఆది-రామసుబ్బారెడ్డి కుటుంబాలు చెరో పార్టీలో ఉండేవి. కాబట్టి ఫ్యాక్షన్ రాజకీయాల్లో క్లారిటి ఉండేది. ఎప్పుడైతే ఆదినారాయణరెడ్డిని చంద్రబాబు టీడీపీలోకి తెచ్చారో అప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయి.

సరే ఆ సమస్యలపై చంద్రబాబు ఏదో విధంగా సర్దుబాటు చేస్తున్న నేపధ్యంలోనే 2019 లో జరిగిన ఎన్నికల్లో ఇటు ఆదితో పాటు అటు రామసుబ్బారెడ్డి కూడా ఘోరంగా ఓడిపోయారు. అదే సమయంలో టీడీపీ కూడా ఓడిపోవటంతో వీళ్ళకు దిక్కుతోచలేదు. అందుకనే టీడీపీలో ఉంటే లాభం లేదనుకున్న రామసుబ్బారెడ్డి వెంటనే వైసీపీలో చేరిపోయారు. ఎప్పుడైతే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారో ఆయన పరిస్ధితి పెనం మీద నుండి పొయ్యిలోకి పడినట్లయ్యిందట. ఎందుకంటే జమ్మలమడుగు ఎంఎల్ఏ సుధీర్ రెడ్డితో గొడవలు మొదలయ్యాయి. ఈ కారణంగానే రామసుబ్బారెడ్డికి పార్టీలో గుర్తింపే లేకుండా పోయిందట.

దాంతో ఇఫుడు రామసుబ్బారెడ్డి పరిస్ధితి ఎలా తయారయ్యిందంటే వైసీపీలో ఉండలేక బయటకు రాలేక అన్నట్లుగా తయారయ్యింది. ఇదే సమయంలో ఈ మాజీ మంత్రి అవస్తలు చూస్తున్న మద్దతుదరులు ఎందుకొచ్చిన తంటాలివి మళ్ళీ టీడీపీలోనే చేరిపోదామని ఒత్తిడి పెడుతున్నారట. అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీలో ఉన్నపుడు జిల్లా వ్యాప్తంగా గుర్తింపు ఉండేదన్న విషయాన్ని మద్దతుదారులు రామసుబ్బారెడ్డికి గుర్తు చేస్తున్నారట. మరి ఈ మాజీ మంత్రి ఏమి నిర్ణయం తీసుకుంటారో అని అందరు ఎదురు చూస్తున్నారు.