మహారాష్ట్రలోకి సీబీఐకి నో ఎంట్రీ

గుర్తుందా కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐకి అనుమతి నిరాకరిస్తు అప్పట్లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సేమ్ టు సేమ్ అదే పద్దతిలో మహారాష్ట్రలో కూడా సీబీఐ ఎంట్రీకి అనుమతిని నిషేధిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం అనుమతి లేకుండా సీబీఐ ఏ కేసును కూడా టేకప్ చేసేందుకు లేదు. అయితే ఏదైనా కేసు విషయంలో సీబీఐ మహారాష్ట్రలోకి ఎంటర్ కావాలంటే కేవలం హైకోర్టు లేదా సుప్రింకోర్టు ఆదేశాలతో మాత్రమే ఎంటర్ అవ్వాల్సుంటుంది. అవసరం అనుకుంటే మహారాష్ట్ర ప్రభుత్వమైనా సీబీఐని రిక్వెస్టు చేయవచ్చు. అయితే సీబీఐ ఎంట్రీని నిషేధించి మళ్ళీ తానే దర్యాప్తును కోరుతుందని ఎవరు అనుకోవటం లేదు.

ఇక్కడ విషయం ఏమిటంటే కొన్ని ఛానళ్ళు తమ టీఆర్పీ రేటింగ్ కోసం అసంబద్దమైన చర్యలకు పాల్పడుతున్నాయనే విషయం బయటపడింది. ఇందులో ప్రముఖంగా రిపబ్లిక్ టీవీ తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఇదే విషయమై రిపబ్లిక్ టీవీ యాజమాన్యానికి, మహారాష్ట్ర పోలీసులకు మధ్య పెద్ద గొడవే నడుస్తోంది. తమపై పోలీసులు తప్పుడు ఆరోపణలు చేసి కేసులు నమోదు చేసి వేధిస్తున్నారంటూ యాజమాన్యం సుప్రింకోర్టులో పిటీషన్ కూడా వేసింది. అయితే ఈ వివాదంపై ఇప్పటికే హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది కాబట్టి వివాదాన్ని హైకోర్టులోనే తేల్చుకోమంటూ సుప్రికోర్టు తేల్చిచెప్పేసింది.

ఈ నేపద్యంలోనే మహారాష్ట్ర పోలీసులు తమను తప్పుడు కేసులతో వేధిస్తున్నారంటూ యాజమాన్యం సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. ఈ విషయమై ముంబాయ్ హైకోర్టులో పెద్ద వివాదమే నడుస్తోంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రంలోకి సీబీఐ ఎంట్రీని నిషేధిస్తు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. విచారణ సందర్భంగా కోర్టు మరి సీబీఐ విచారణకు ఆదేశిస్తే ప్రభుత్వం ఏమి చేస్తుందన్న విషయం ఆసక్తిగా మారింది. మొత్తానికి ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నంత కాలం తమకు సమస్యలు రాకుండా ఉండేదుకే సీబీఐ ఎంట్రీని నిషేధిస్తోందని.

అధికారంలో ఉన్నపుడు సీబీఐని నిషేధించిన చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి ప్రతి విషయానికి సీబీఐ విచారణనే డిమాండ్ చేస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు సీబీఐ ఎంట్రీని ఎందుకు నిషేధించారు ? ప్రతిపక్షంలోకి రాగానే ఎందుకు మళ్ళీ అదే సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్నారు ? అంటే అధికారంలో ఉన్నపుడు సీబీఐ దాడులు, కేసుల నుండి తన మద్దతుదారులను రక్షించుకునేందుకే అన్నది అర్ధమైపోయింది. బహుశా మహారాష్ట్రలో కూడా అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత శివసేన కూటమి ప్రభుత్వం సీబీఐ విచారణనే డిమాండ్ చేస్తుందేమో చూడాలి.