వైసీపీ.. టీడీపీల‌.. బీసీ రాజ‌కీయం.. మొగ్గెవ‌రికి?

రాజ‌కీయాల్లో వ్యూహ ప్ర‌తివ్యూహాలు కామ‌న్‌. త‌ల‌త‌న్నే పార్టీకి తాడిత‌న్నేలా వ్యూహం వేయ‌డం.. ముందు కు సాగ‌డం, పైచేయి సాధించ‌డం రాజ‌కీయాల్లో త‌ర‌చుగా చూస్తేనే ఉన్నాం. పోక‌చెక్క‌తో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా! అనే రేంజ్‌లో పార్టీలు, నాయ‌కులు కూడా వీధి పోరాటాల‌కు దిగ‌డం కామ‌న్‌. ఇక‌, ఇప్పుడు అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్షం టీడీపీ రెండూ కూడా బీసీ ఓటు బ్యాంకు పై క‌న్నేశాయి. వాస్త‌వానికి ఇప్ప‌ట్లో ఎన్నిక‌లు లేక‌పోయినా.. బీసీ వ‌ర్గాల‌ను ఇప్ప‌టి నుంచి రాజ‌కీయంగా త‌మ‌వైపు తిప్పుకొనేందుకు రెండు పార్టీలూ ప్ర‌య‌త్నాలు చేశాయి. ఈ విష‌యంలో అధికారంలో ఉన్న వైసీపీ కార్పొరేష‌న్ల పేరుతో పెద్ద వ్యూహానికే తెర‌దీసింది.

దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల్లో 132 కులాల‌కు 56 కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేసింది. వీటిలో చైర్మ‌న్ల‌ను కూడా నియ‌మించింది. అందులోనూ మ‌హిళ‌ల‌కు 50 శాతం కోటా ప్ర‌క‌టించింది. అంటే.. బీసీల‌కు తాము ఇచ్చిన ప్రాధాన్యం ఇంకెవ‌రూ ఇవ్వ‌లేర‌నే రేంజ్‌లో నిర్ణ‌యాలు తీసుకుంది. నిజానికి ఈ ప‌రిణామం.. బీసీల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీసీ వ‌ర్గ‌మే.. మా పార్టీకి వెన్నెముక అని చెప్పే.. చంద్ర‌బాబు కూడా ఇన్ని కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌లేదు క‌దా? అని చ‌ర్చించే రేంజ్‌లో వైసీపీ నిర్ణ‌యం ఉండ‌డంతో స‌హ‌జంగానే టీడీపీలో ఒకింత ఆందోళ‌న వ్య‌క్తమైంది.

దీంతో చంద్ర‌బాబు త‌న పార్టీలో బీసీల‌కు ప్రాధాన్యాన్ని అమాంతం పెంచేశారు. ఇక్క‌డో చిత్ర‌మైన విష‌యం చెప్పుకోవాలి. పార్టీలో కీలకమైన సంస్థాగత పదవులను ముందుగానే నిర్ణ‌యించిన చంద్ర‌బాబు.. ఆదివార‌మే వీటిని ప్ర‌క‌టించాల్సి ఉంది. ఈ మేర‌కు మీడియాకు కూడా క‌బురు వ‌చ్చేసింది. అయితే, ఇంత‌లోనే వైసీపీ ప్ర‌భుత్వం బీసీ కార్పొరేష‌న్ల‌ను ప్ర‌క‌టిస్తుంద‌ని తెలిసి.. బాబు వెన‌క్కి త‌గ్గారు. త‌ర్వాత ప్ర‌క‌టిస్తామ‌ని సందేశం పంపారు. అయితే, ఈ గ్యాప్‌లో ఏం జ‌రిగింద‌ని ఆరా తీస్తే..వైసీపీలో కార్పొరేష‌న్ ప‌ద‌వుల విష‌యాన్ని బాబు నిశితంగా గ‌మ‌నించి.. బీసీల‌కు భారీ ఎత్తున ప్రాధాన్యం ఇచ్చిన వైసీపీని త‌ల‌ద‌న్నేలా టీడీపీ క‌మిటీలు ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలోనే రాత్రికి రాత్రి కొంద‌రి పేర్ల‌ను మార్చి.. బీసీ వ‌ర్గాల‌కు చెందిన మ‌రింత మంది పేర్ల‌ను చంద్ర‌బాబు స‌ద‌రు జాబితాలో చేర్చార‌ని తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ ఏపీ అధ్య‌క్ష పీఠం స‌హా.. చాలా ప‌ద‌వులు.. బీసీల‌కే చంద్ర‌బాబు ఇచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అటు వైసీపీ కార్పొరేష‌న్ల‌తోను, ఇటు టీడీపీ పార్టీ ప‌ద‌వుల‌తోనూ బీసీల‌కు ప్రాధాన్యం పెంచాయి. మ‌రిఇప్పుడు ఈ బీసీ వ‌ర్గాలు ఎటు నిల‌బ‌డాలి? ఎవ‌రికి జైకొట్టాలి? అనేదే కీల‌క అంశంగా మారింది.

టీడీపీ ప‌రంగా చూస్తే.. ప‌ద‌వులు పొందిన వారిలో చాలా మంది ఉద్ధండులు ఉన్నారు. కాబ‌ట్టి పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ప‌రుగులు పెట్టించే అవ‌కాశం ఉంటుంది. ఇక‌, వైసీపీ ప‌రంగా చూస్తే.. కార్పొరేష‌న్ల ద్వారా ఆర్థిక ల‌బ్ధిని అందించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. మొత్తంగా బీసీల‌కు బాగానే ఉన్నా.. ఈ రెండు పార్టీల‌కు మాత్రం వీరు ఎటు మొగ్గుతార‌నే విష‌యంలో టెన్ష‌న్ నెల‌కొంది. చివ‌రికి ఏం జ‌రుగుతుంద‌నేది బీసీలే తేల్చాలి!!