ధోనీ కోపం.. ఆగిపోయిన అంపైర్.. దుమారం

ఈ ఏడాది ఐపీఎల్‌లో అంపైరింగ్‌‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ కరోనా భయం మధ్య, బయో బబుల్‌లో, అది కూడా యూఏఈలో జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడూ ఐపీఎల్‌లో అంపైరింగ్ చేసే ఎలైట్ అంపైర్లు ఈసారి అందుబాటులో లేరు. చాలా వరకు భారతీయ అంపైర్లు, అంతగా పేరు లేని విదేశీ అంపైర్లు మ్యాచ్‌ల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

ఐతే వారి అంపైరింగ్ ప్రమాణాలకు తగ్గట్లు లేకపోవడం విమర్శల పాలవుతంోది. తరచుగా అంపైరింగ్ తప్పిదాలు చోటు చేసుకుంటుండటంతో ఇటు ఆటగాళ్ల నుంచి అటు అభిమానుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి తరుణంలో మంగళవారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ పరిణామం దుమారం రేపింది.

ఛేదనలో సన్‌రైజర్స్ బ్యాటింగ్ సందర్భంగా 19వ ఓవర్లో శార్దూల్ ఠాకూర్ వేసిన బంతి ఆఫ్ సైడ్ ఆవల పడింది. రషీద్ ఖాన్ దాన్ని షాట్ ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. అది వైడ్ అనే అంతా అనుకున్నారు. అంపైర్ కూడా వైడ్ ఇవ్వడానికి చేతులు చాచుతూ పక్కకు తిరిగాడు. కానీ అంతలో ధోని కోపంగా అంపైర్ వైపు చూస్తూ ఇది వైడేంటి అన్నట్లుగా సంకేతం ఇచ్చాడు. అంతే.. అంపైర్ చేతులు కిందికి దించుతూ వైడ్ సిగ్నల్ ఇవ్వకుండా ఆగిపోయాడు.

ఇదంతా డగౌట్ నుంచి చూస్తున్న సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. ఇదేం అన్యాయం అన్నట్లుగా చూశాడు. టీవీలో ఈ దృశ్యాలు చూసిన ప్రేక్షకులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. అది వైడా కాదా అన్నది పక్కన పెడితే.. ధోని కోపం చూసి అంపైర్ వైడ్ ఇవ్వబోయి ఆగిపోవడం ఎవ్వరికీ మింగుడు పడలేదు. దీంతో సన్‌రైజర్స్ అభిమానులు, చెన్నై సూపర్ కింగ్స్ వ్యతిరేకులు ధోనీని, అంపైర్‌ను ట్రోల్ చేశారు. ఐపీఎల్ ప్రమాణాలను ప్రశ్నించారు.