ఆ సినిమా ఆగిపోలేదన్న దర్శకుడు

హిరణ్యకశ్యప.. టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉన్న సినిమా. ‘రుద్రమదేవి’ లాంటి సాహసోపేత చారిత్రక చిత్రాన్ని రూపొందించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్.. దాని తర్వాత తీయాలనుకున్న సినిమా ఇదే. రానా దగ్గుబాటిని హిరణ్యకశ్యపుడిగా పెట్టి రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ సినిమా తీయాలని తలపోశాడు గుణ. ఇందుకోసం కొన్నేళ్ల పాటు రీసెర్చ్ చేశాడు. ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జరిగాయి.

ప్రి విజువలైజేషన్ వర్క్ సైతం జరిగింది. కానీ కరోనా వల్లో మరో కారణంతోనో ఈ సినిమాకు బ్రేక్ పడింది. ఈలోపు ‘శాకుంతలం’ పేరుతో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు గుణ. మహాభారతంలోని ఒక పర్వమైన ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. దుష్యుంతుడు-శకుంతలల ప్రేమకథకు గుణ వెండితెర రూపం ఇవ్వనున్నాడు.

ఐతే కొన్నేళ్ల నుంచి ‘హిరణ్యకశ్యప’ గురించి చెబుతూ.. ఇప్పుడు ‘శాకుంతలం’ సినిమాను ప్రకటించడంతో ముందు అనుకున్న భారీ ప్రాజెక్టు అటకెక్కేసినట్లే అని అంతా అనుకుంటున్నారు. ఈ సినిమాను నిర్మించాల్సిన సురేష్ బాబు, ఇందులో లీడ్ రోల్ చేయాల్సిన రానా నుంచి దాని గురించి ఎలాంటి ప్రకటన లేకపోవడం ఈ సందేహాలను పెంచుతోంది.

కానీ గుణశేఖర్ మాత్రం ఆ ప్రచారాన్ని గట్టిగా ఖండించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘హిరణ్య కశ్యప’ తనకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అని, దాని మీద కొన్నేళ్ల పాటు పని చేశానని.. దానికి స్క్రిప్టు, ప్రి ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తయ్యాయని చెప్పాడు. ఈ సినిమాకు లొకేషన్లు, సెట్స్ కూడా ఓకే అయినట్లు తెలిపాడు.

ఐతే ఆ చిత్రం భారీ కాస్ట్ అండ్ క్రూతో చేయాల్సిందని, వందల మందితో చిత్రీకరణ జరపాలని.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అది సాధ్యం కాదని, అందుకే తక్కువమందితో, పరిమిత లొకేషన్లలో తీయడానికి అవకాశమున్న ‘శాకుంతలం’ను ముందు పూర్తి చేయడానికి నడుం బిగించానని చెప్పాడు గుణశేఖర్.