బీజేపీకి-ఖుష్పూకు కెమిస్ట్రీ కుదిరేనా? రీజ‌నేంటంటే!

త‌మిళ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలిగా.. ఎంత‌టి వారిపైనైనా.. విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించే నేత‌గా గుర్తింపు పొందిన ప్ర‌ముఖ న‌టి.. ఖుష్బూ.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనూహ్య రీతిలో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం.. క్ష‌ణాల వ్య‌వ‌ధిలో పార్టీ మారిన తీరు రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించింది.

నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ఆమె అనుచ‌రులుగా ఉన్న‌వారికికూడా చిత్రంగాను, విచిత్రంగాను అనిపించింది. దీనికి కార‌ణం.. ముస్లిం మైనార్టీ వ‌ర్గానికి చెందిన ఖుష్బూ.. హిందూత్వ అజెండాను భుజాన వేసుకున్న బీజేపీలో చేర‌డం.. ఆ పార్టీ చేర్చుకోవ‌డం. దీంతో అస‌లు ఈ చేరిక‌.. ఎవ‌రికి లాభం? ఎవరికి న‌ష్టం? అస‌లు బీజేపీకి-ఖుష్బూకు కెమిస్ట్రీ కుదురుతుందా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

మ‌హారాష్ట్రలోని ముంబైకి చెందిన ముస్లిం కుటుంబంలో ఖుష్బూ జ‌న్మించారు. బాల‌న‌టిగా సినీ రంగ ప్ర‌వేశం చేసి.. దాదాపు 34 ఏళ్లుగా చెన్నైలోనే ఉన్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు, నిర్మాత సి. సుంద‌ర్‌ను వివాహం చేసుకున్నారు.

ఇక‌, ఆమె తొలి రాజ‌కీయ ప్ర‌వేశం 2010లో డీఎంకేతో ప్రారంభ‌మైంది. దివంగ‌త క‌రుణానిధి పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఖుష్బూ.. ఈ పార్టీలో ఎదిగే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. వివాదాస్ప‌ద నాయ‌కురాలిగా పేరు తెచ్చుకుని అత్యంత త‌క్కువ స‌మ‌యంలో అంటే.. 2014లోనే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అనంత‌రం.. కాంగ్రెస్ పార్టీలో చేశారు. నిజానికి త‌మిళ‌నాడులో ప్రాంతీయ పార్టీల‌దే హ‌వా. రెండు ప్ర‌ధాన జాతీయ పార్టీలు.. కాంగ్రెస్‌, బీజేపీల ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టే.

అయిన‌ప్ప‌టికీ.. ఖుష్బూ.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్ప‌ట్లోనే ఆమెకు రాజ్య‌స‌భ టికెట్ ఇస్తామ‌ని .. కాంగ్రెస్ హామీ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారంలో ఉంది. అయితే, ఇప్ప‌టికీ అది నెర‌వేర‌క‌పోవ‌డంతో పార్టీ జాతీయ అధికార ప్ర‌తినిధి ప‌ద‌వికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ, హిందూత్వ అజెండాను న‌మ్ముకున్న బీజేపీకి.. ఇదే అంశంలో అనేక వివాదాలు, అనేక విమ‌ర్శ‌లు, కేసులు ఉన్న ఖుష్బూకు మ‌ధ్య కెమిస్ట్రీ కుదురుతుందా? ముఖ్యంగా త‌మిళ ముస్లిం ఓట‌ర్లు ఈ ప‌రిస్థితిని జీర్ణించుకుంటారా? అనేది ప్ర‌శ్న‌. గ‌తంలో రాముడు, కృష్ణుడు బొమ్మ‌లు ముద్రించిన చీర‌ను ధ‌రించి వివాదానికి తెర‌దీశారు ఖుష్బూ. ఈ క్ర‌మంలోనే హిందూ మ‌క్క‌ల్ క‌ట్చి స‌హా.. బీజేపీ కూడా.. దీనిని రాజ‌కీయం చేసి.. ఆమెను క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

అయితే, ఇలాంటి కుక్క‌ల‌కు నేను స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదంటూ.. ఖుష్బూ ఎదురుదాడికి దిగారు. దీంతో ఆమెపై ప‌లు కేసులు కూడా న‌మోద‌య్యాయి. ఇలా ఒక సంద‌ర్భంలో కాదు.. అనే సంద‌ర్బాల్లో.. హిందూ దేవ‌త‌ల‌ను అవ‌మానించేలా కుష్బూ వ్య‌వ‌హ‌రించార‌నే కేసుల విచార‌ణ పెండింగ్‌లో ఉంది. మ‌రి ఈ నేప‌థ్యంలో బీజేపీలోకి ఖుష్బూ రాక‌ను బీజేపీలోని ఓ వ‌ర్గం నేత‌లు.. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వాదులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. కానీ, వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో బీజేపీ వేసిన ఈ అడుగు ఇప్ప‌టికే దూర‌మైన ముస్లింలతోపాటు హిందువుల‌ను కూడా దూరం చేసే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.