బాలీవుడ్ ఎటాక్.. దర్శకుడికి రివర్స్ ఎటాక్

బాలీవుడ్లో డ్రగ్స్ రాకెట్ గురించి కొన్ని రోజులుగా ఎంత పెద్ద చర్చ నడుస్తోందో తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం చోటు చేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో బాలీవుడ్ మొత్తం డ్రగ్స్‌లో మునిగిపోయిందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. దీని మీద మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.

ఐతే కొన్నాళ్ల పాటు ఈ వ్యవహారాన్ని మౌనంగా చూస్తూ ఉన్న బాలీవుడ్ పెద్దలు.. ఇటీవల మౌనం వీడారు. తమ ప్రతిష్ఠను దెబ్బ తీస్తోందన్న ఉద్దేశంతో రిపబ్లిక్ టీవీ మీద నాలుగు పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల అధినేతలతో పాటు ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లు సైతం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనికి బాలీవుడ్ నుంచి బలమైన మద్దతే లభించింది. రిపబ్లిక్ టీవీని టార్గెట్ చేస్తూ, పిటిషన్ వేసిన బాలీవుడ్ బడా బాబులకు మద్దతుగా చాలామంది ఇండస్ట్రీ జనాలు పోస్టులు పెట్టారు.

ఐతే ముందు నుంచి ఈ బాలీవుడ్ పెద్దల మీద పోరాడుతున్న కంగనా రనౌట్ మాత్రం వీళ్లిలా పిటిషన్ వేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. వాళ్లందరూ తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శలు గుప్పించింది. ఇప్పుడు మరో బాలీవుడ్ ప్రముఖుడు కంగనా బాటలో నడిచాడు. సొంత ఇండస్ట్రీ మీద విమర్శలు గుప్పించాడు. అతనే ప్రముఖ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.

తమ గురించి రిపబ్లిక్ టీవీ వాడిన అభ్యంతరకర పదాలను ఉటంకిస్తూ పిటిషన్ వేయడాన్ని ప్రస్తావిస్తూ.. వివేక్ ఇండస్ట్రీ జనాలకు కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఒక హిందీ సినిమాలో వేశ్య పాత్రకు ‘సావిత్రి’ అని పేరు పెట్టారని.. అది అభ్యంతరకరం కాదా అని ప్రశ్నించాడు. సంగీతం, భాష, సంస్కృతి, కళ.. ఇలాంటి వాటిని నాశనం చేస్తున్నందుకు బాలీవుడ్ మీద జనాలు కూడా దావా వేయొచ్చా అని అతను ప్రశ్నించాడు. కంగనా తరహాలోనే వివేక్ సైతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతుదారన్న పేరుంది. లిబరల్స్‌గా ముద్ర వేయించుకోవడానికి ప్రయత్నించే బాలీవుడ్ ప్రముఖుల మీద అతను ఈ మధ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాడు.