లాక్‌డౌన్‌లో ‘రాధేశ్యామ్’ టీం ఏం చేసినట్లు?

‘సాహో’ లాంటి భారీ చిత్రం షూటింగ్ చివరి దశకు వచ్చే వరకు దానికి సంగీత దర్శకుడు ఎవరన్నది తేలలేదు. ముందు శంకర్-ఎహ్‌సాన్-లాయ్‌లను మ్యూజిక్ డైరెక్టర్లుగా పెట్టుకున్నప్పటికీ వాళ్లు మధ్యలో తప్పుకున్నారు. వాళ్ల స్థానంలోకి ఎవరు వస్తున్నారన్నది విడుదలకు మూణ్నాలుగు నెలల ముందు కూడా వెల్లడి కాలేదు. ఓవైపు సినిమా పూర్తి కావస్తున్నా.. సంగీతం ఎవరు అందిస్తున్నది తెలియక కన్ఫ్యూజ్ అయిపోయారు అభిమానులు. చివరికి ఒక్కో పాట ఒక్కొక్కరితో చేయించారు. అదంతా కంగాళీగా తయారై ఆడియో ఆ చిత్రానికి మైనస్ అయింది.

అయితే ఆ అనుభవం నుంచి పాఠం నేర్చుకోకుండా.. ప్రభాస్ తర్వాతి చిత్రానికి కూడా సంగీతం విషయంలో ఇదే ఒరవడిని అనుసరిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ మొదలై ఏడాది దాటుతున్నా ఈ చిత్రానికి ఇప్పటిదాకా సంగీత దర్శకుడు ఖరారవ్వలేదు.

మూణ్నెల్ల కిందట ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసినపుడు దాని పోస్టర్లు కీ టెక్నీషియన్లందరి పేర్లూ కనిపించాయి. కానీ సంగీత దర్శకుడి పేరు లేదు. తాజాగా పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. దాని మీదా సంగీత దర్శకుడి పేరు లేదు. అంతకుముందంటే షూటింగ్‌ బిజీలో ఉండి మ్యూజిక్ డైరెక్టర్ సంగతి తేల్చలేదు అనుకుందాం. కానీ ఆరేడు నెలలుగా షూటింగ్ లేదు. చిత్ర బృందమంతా ఖాళీగానే ఉంది. మరి ఈ సమయంలో ఎవరితోనూ ఎందుకు సంప్రదింపులు జరపలేదు. మ్యూజిక్ విషయంలో ఎందుకు ఏమీ తేల్చలేదు అన్నది అభిమానులకు అర్థం కావడం లేదు.

పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఈ మాత్రం ప్లానింగ్ లేకుంటే ఎలా అన్నది ప్రేక్షకుల ప్రశ్న. ‘రాధేశ్యామ్’ ఒక ప్రేమకథ. అందులో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మనసు పెట్టి, టైం తీసుకుని సంగీతం అందించాల్సిన అవసరం ఉన్న సినిమా ఇది. ఇలాంటి సినిమా విషయంలోనూ సంగీత దర్శకుడిని ఖరారు చేసే విషయంలో ప్రభాస్, యువి క్రియేషన్స్ అధినేతలు, దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఎందుకు నాన్చుతున్నారన్నది అర్థం కావడం లేదు.