లోకేష్ ధైర్యం చేశాడంటున్నారు

మొత్తానికి నారా లోకేష్ చాలా ధైర్యమే చేశారు. చాలా కాలం తర్వాత హైదరాబాద్ ను వదిలి చంద్రబాబునాయుడుతో కలిసి లోకేష్ కూడా అమరావతికి వచ్చారు. అమరావతి రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమం 300 రోజులు పూర్తియిన సందర్భంగా లోకేష్ కొన్ని రాజధాని గ్రామాల్లో పర్యటించారు. తండ్రి, కొడుకులు అమరావతికి వచ్చి ఐదు రోజులవుతున్నా ఇప్పటి వరకు పార్టీ నేతలెవరినీ కరకట్ట మీదున్న ఇంట్లోకి అనుమతించలేదు. చంద్రబాబు రాష్ట్రంలోకి వచ్చారన్న కారణంతో కలుద్దామని కరకట్ట ఇంటికి వచ్చిన నేతలకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. దాంతో వాళ్ళు చంద్రబాబును కలవకుండానే వెనక్కు వెళ్ళిపోతున్నారు.

ఇదే సమయంలో ప్రతిరోజు చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశాలు పెట్టుకుంటునే ఉన్నారు. ఎలాగంటే జూమ్ యాప్ ద్వారానే వివిధ జిల్లాల్లోని నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇక్కడే నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. అమరావతికి వచ్చిన తర్వాత కూడా నేతలతో జూమ్ లోనే మాట్లాడుతుంటే ఇక హైదరాబాద్ నుండి ఎందుకు వచ్చినట్లు ? అని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం చంద్రబాబు+లోకేష్ చెవిన పడిందట. ఇందుకనే తాను ఇంట్లోనే ఉండి లోకేష్ ను బయట పర్యటించేలా చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే లోకేష్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. పైగా అమరావతి కోసం రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మొదలుపెట్టి సోమవారానికి 300 రోజులు పూర్తయ్యాయి.

ఆందోళనలు చేస్తున్న వారికి నైతిక మద్దతు ఇచ్చేట్లుగా లోకేష్ అమరావతి ప్రాంతంలోని కురగల్లు, దొండపాడు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్ళూరు, అనంతవరం గ్రామాల్లో పర్యటించారు. నిజానికి ఈపని లోకేష్ ఎప్పుడో చేసుండాలి. కరోనా వైరస్ కారణంగా చంద్రబాబు గడచిన ఏడు మాసాలుగా ఇంట్లోనే కూర్చున్నారంటే అర్ధముంది. చంద్రబాబు వయస్సు 70 ఏళ్ళు దాటింది కాబట్టి ఆరోగ్య జాగ్రత్తల కోసమని ఇంట్లోనే కూర్చున్నారని అనుకున్నా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ 40ల్లో ఉన్న లోకేష్ కూడా తన తండ్రి లాగే ఇంట్లేనే కూర్చుంటే ఎలా.

ధైర్యం చేసి బయటకు రావాలని నేతలందరు ఎప్పటి నుండో అనుకుంటున్నదే. దానికి తగ్గట్లే లోకేష్ ఒకేసారి ఐదారు గ్రామాల్లో పర్యటించారు. దొండపాడు గ్రామంలో కాస్త వ్యతిరేక గాలి వీచినా మొత్తం మీద గ్రామాల్లో పర్యటించటం నేతల్లో ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. పార్టీ క్యాడర్ తో గ్యాప్ వచ్చేస్తే నేతలకు ఎలా నష్టమో నేతలతో గ్యాప్ వచ్చేస్తే చంద్రబాబు, లోకేష్ కు నష్టం. చంద్రబాబును మినహాయించినా లోకేష్ మాత్రం గ్యాప్ రాకుండా చూసుకునుంటే బాగుండేది. సరే జరిగిపోయిన విషయం గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేని మాట నిజమే. ఇప్పటి నుండైనా ట్విట్టర్ వేదికను వదిలిపెట్టి జనాల్లో లోకేష్ తిరగటాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే.