కేంద్రానికి కావాల్సింది రాష్ట్రాలపై పెత్తనమేనా ?

తాజాగా ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూసిన తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోయాయి. రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదాలు ముఖ్యమంత్రులు కేసీయార్, జగన్మోహన్ రెడ్డి స్ధాయిలో పరిష్కారం కాలేదు. దాని ఫలితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి తమ సమస్య పరిష్కార బాధ్యతను కేంద్ర ప్రభుత్వంపై పెట్టారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న కేంద్రం సమస్యను పరిష్కరించకుండా కర్ర విరకుండా పాము చావకుండా అనే సామెతలో చెప్పినట్లుగా వ్యవహిరించింది. దాని ఫలితంగా సమస్య వెంటనే పరిష్కారం కాకపోవటమే కాకుండా మొత్తం సమస్యను కేంద్రం తన చేతిలోకి తీసుకున్నది.

గతంలో కూడా నదీజలాల విషయాల్లో అనేక సమస్యలుండేవి. సమైక్య రాష్ట్రంలో నిర్మించిన కొన్ని ప్రాజెక్టులకు అప్పట్లో కూడా అనుమతులు లేవు. దాంతో వివాదం తలెత్తినపుడు ఏపి-మహారాష్ట్ర-కర్నాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులే తమ స్ధాయిలో వివాదాలను పరిష్కరించుకున్నారు. అనుమతులతోనో లేకుండానో మొదలైన ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రాల స్ధాయిలోనే చర్చలు జరుపుకుని పరిష్కారం చేసుకున్నారు. తెలుగుగంగ, పోలవరం, ఆలమట్టి, బాబ్లీ లాంటి ప్రాజెక్టుల విషయంలో రేగిన వివాదాలను అప్పట్లో ముఖ్యమంత్రులు తమ స్ధాయిలోనే పరిష్కరించుకున్నారు.

మరిపుడు మాత్రమే ఇద్దరు సిఎంలు సమస్య పరిష్కారాన్ని ఢిల్లీ చేతిలో పెట్టారు ? ఎందుకంటే కేసీఆర్ ఒంటెత్తు పోకడలే కారణమంటూ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు తదితరాలకు అనుమతులు లేవన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బలంగా వినిపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేయకూడదంటే శ్రీశైలం ఎడమగట్టు, నాగార్జున సాగర్ కుడి కాల్వ నిర్వహణ ఏపికి అప్పగించాలంటూ గట్టిగా చెప్పారు. లేకపోతే మొత్తం కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేంద్రమే తీసుకోవాలని బలంగా వాదించారు.

సరే కేసీఆర్ కూడా తన వాదనను బలంగానే వినిపించారు. అసలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ స్కీమ్ కే అనుమతులు లేనపుడు మళ్ళీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలా నిర్మిస్తారంటూ మండిపోయారు. ఏపి తన ఇష్టం వచ్చినట్లు తాను ప్రాజెక్టులు కట్టుకుంటామంటే తాము కూడా జూరాల దిగువన మరో ప్రాజెక్టు నిర్మిస్తామని తెగేసి చెప్పారు. శ్రీశైలం, సాగర్ కాల్వల పర్యవేక్షణ తమకే ఇవ్వాలంటూ కేసీయార్ గట్టిగా పట్టుబట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇద్దరు సిఎంల వాదనలోను నిజాలున్నాయి. కానీ అదే సమయంలో కేసీఆర్ సెంటిమెంట్ ను దీనికి జతపరచడం వల్ల వివాదం అవుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టులోని నీటి మట్టంతో సంబంధం లేకుండానే తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని ఏపి ఆధారాలతో సహా నిరూపించింది. ఇక్కడ విషయం ఏమిటంటే రెండు రాష్ట్రాల్లోను సాగు, తాగు నీటివసరాలున్నాయి. విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరమూ ఉంది. మరలాంటపుడు ఒకరి అవసరాన్ని మరొకరు గుర్తించి గౌరవించుకుంటే సమస్య పరిష్కారం పెద్ద కష్టం కాదు.

కానీ ఏపి విషయంలో కేసీఆర్ మొండిపట్టుకు పోవటంతోనే సమస్య పరిష్కారం చివరకు కేంద్రం చేతిలోకి వెళ్ళింది. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఎప్పుడు వస్తాయా ? ఎప్పుడెప్పుడు వేలు పెడదామా ? అని కేంద్రం కూడా ఎదురు చూస్తోంది. ఈ సమయంలోనే రెండు రాష్ట్రాల సిఎంలు తమ స్ధాయిలో సమస్యలను పరిష్కరించుకోలేకపోవటంతో ఇపుడు పెత్తనం కేంద్రం చేతిలోకి వెళిపోయింది.