సోము రాజ‌కీయం.. ఏపీ కోస‌మా? తెలంగాణ కోస‌మా?

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు వింత రాజ‌కీయం చేస్తున్నారా? ఆయ‌న వేస్తున్న అడుగులు సొంత పార్టీలోనే ఎబ్బెట్టుగా ఉన్నాయ‌నే టాక్ వ‌స్తోందా? ఏపీలో ఉంటూ.. పొరుగు రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడుతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు బీజేపీలోని ఓ వ‌ర్గం.

ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. ఏనేత అయినా.. తాను ఉన్న ప్రాంతానికి, తాను ఉన్న రాష్ట్రానికి మేలు జ‌రిగేలా కోరుకుంటారు. ఇదే ప్ర‌జా బ‌లానికి దారితీస్తుంది. అంతిమంగా నేత‌కు మేలు చేస్తుంది. కానీ.. ఏపీ బీజేపీ చీఫ్‌.. సోము వీర్రాజు వ్య‌వ‌హారం మాత్రం దీనికి విరుద్ధంగా ఉంద‌ని అంటున్నారు సొంత పార్టీ నాయ‌కులే!

ప్ర‌స్తుతం ఏపీ-తెలంగాణ‌ల మ‌ధ్య నీటి వివాదాలు ముదిరాయి. ఈ విష‌యం ఢిల్లీ వ‌ర‌కు చేరింది. ఏపీ క‌డుతున్న సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌ను తెలంగాణ వ్య‌తిరేకిస్తోంది. కానీ, దీనిని పూర్తి చేయాల‌ని ఏపీ ప్ర‌భుత్వం అనుకుంటోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌ను ఏదో విధంగా బుజ్జ‌గించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు జ‌గ‌న్‌. అయితే, తెలంగాణ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల నేప‌థ్యంలో కేసీఆర్ మ‌రో విధంగా మాట్లాడుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఈ వివాదంపై కేంద్రం దృష్టి పెట్టింది. దీనిపై తెలంగాణ బీజేపీ నేత‌లు పెద్ద‌గా రియాక్ట్ కాలేదు. కానీ, ఏపీ బీజేపీ చీఫ్ సోము మాత్రం దీనిలోనూ రాజ‌కీయాలు వెతుక్కున్నారు.

కేంద్రానికి సోము లేఖ రాశారు. తెలంగాణ ప్రాజెక్టులు క‌డుతుంటే.. నాటి చంద్ర‌బాబు సీఎంగా ఉండి కూడా చూస్తూ ఊరుకున్నార‌ని, అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడుగా ఉన్న జ‌గ‌న్‌కూడా మౌనం పాటించార‌ని, సో.. ఇప్పుడు వారే తేల్చుకుంటార‌ని ఆయ‌న రాసిన లేఖ‌లో పేర్కొన‌డం రాజ‌కీయంగా దుమారం రేపింది.

అంతేకాదు, తెలంగాణ చేప‌ట్టిన ప్రాజెక్టులు పూర్త‌య్యే ద‌శ‌లో ఉన్నాయి కాబ‌ట్టి.. వాటికి స‌హ‌క‌రించ‌డ‌మే మేల‌ని ఏపీకి సోము ఉచిత స‌ల‌హా విసిరేశారు. అయితే, సీమ ప్రాజెక్టుల విష‌యంలో ప‌ర‌స్ప‌రం ఇరు రాష్ట్రాలూ స‌హ‌క‌రించుకోవాల‌ని సూచించారు. ఇదీ.. సోము వీర్రాజు కేంద్రానికి రాసిన లేఖ సారాంశం.

ప‌నిలో ప‌నిగా చంద్ర‌బాబుపై నాలుగు విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే, ఈ లేఖ‌ అస‌లు ఏమైనా బాగుందా? అనేది బీజేపీ నేత‌ల టాక్‌! ఎక్క‌డైనా సొంత రాష్ట్రం మేలు కోరుతూ.. లేఖ రాస్తార‌ని.. పైగా సోముకు నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌పై అవగాహ‌న లేన‌ప్పుడు నిపుణుల‌ను సంప్ర‌దించి అయినా లేఖ రాసి ఉంటే బాగుండేద‌ని.. సునిశిత‌మైన ఈ విష‌యంలో రాజ‌కీయం చేయ‌డం పార్టీకి ఇబ్బందేన‌న్న‌ది వీరి భావ‌న‌. ఏదేమైనా.. సోము రాసిన లేఖ‌తో సీమ రాజ‌కీయాల్లో ఒకింత దూకుడుగా ఉన్న కొంద‌రు నాయ‌కులకు ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.