బాలేని సినిమా చూసేందుకు 299 పెట్టాలట

ఖాలిపీలి అని హిందీ సినిమా. పెద్దగా అంచనాల్లేకుండా ఓటీటీ ద్వారా నేరుగా విడుదలైంది. ఈ సినిమా హక్కుల్ని కొన్న జీ5.. జీప్లస్ పేరుతో వేరే కేటగిరీలో పే పర్ వ్యూ పద్ధతిన ఈ చిత్రాన్ని విడుదల చేసింది. కానీ ఆ రేటు చూసిన వాళ్లకు దిమ్మదిరిగిపోతోంది. ఏకంగా రూ.299 పెట్టి ఈ సినిమా చూడాలట.

ఓవైపు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ కోసం డబ్బులు పెట్టి.. మళ్లీ అందులో కొత్త సినిమా చూసేందుకు రూ.299 చెల్లించాలంటే ప్రేక్షకుల పరిస్థితి ఏంటో అంచనా వేయొచ్చు. ఎవరైనా సూపర్ స్టార్ నటించిన క్రేజీ మూవీ కోసం అయితే అంత రేటు పెట్టడానికి ముందుకొస్తారు కానీ.. ఇషాన్ ఖట్టర్, అనన్యపాండే లాంటి కొత్త తారల సినిమాకు ఏం క్రేజ్ ఉంటుంది? పైగా ఈ సినిమా మీద ముందు నుంచి పెద్దగా అంచనాల్లేవు. ఏమాత్రం హైప్ లేకుండా సినిమా రిలీజైంది. దానికి తోడు బ్యాడ్ రివ్యూలు వచ్చాయి.

క్రిటిక్స్ అందరూ బాలేదని ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన సినిమాను ఎవరైనా రూ.299 పెట్టి చూస్తారా? ఒక వస్తువుకు రేటు తగ్గిస్తే ఎక్కువమంది కొనడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. అలా కాకుండా ఒక్కో వస్తువు మీద ఎక్కువ లాభం ఆశించి ఎక్కువ రేటు పెడితే అసలు అది సేలే కాదు. ఇంత చిన్న లాజిక్ మరిచిపోయి ‘ఖాలిపీలి’కి అంతేసి ధర పెట్టారు. దీంతో ఈ చిత్రానికి మినిమం రెస్పాన్స్ లేదని ట్రేడ్ పండిట్లు అంటున్నారు. ఈ సినిమాకు ఆన్ లైన్లో తెగుతున్న టికెట్ల లెక్కల ప్రకారం చూస్తే బాక్సాఫీస్ దగ్గర మూణ్నాలుగు కోట్లు కూడా వచ్చేవి కావంటున్నారు.

‘ఖాలి పీలి’తో పాటే తమిళ చిత్రం ‘కపే రణసింగం’ను కూడా జీప్లస్‌లో రిలీజ్ చేశారు. ఆ చిత్రానికి టికెట్ రేటు రూ.199 పెట్టారు. సినిమా బాగుందన్న టాక్ రావడంతో దానికి రెస్పాన్స్ పర్వాలేదంటున్నారు. కానీ ఆ రేటు కూడా ఎక్కువే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆన్‌లైన్లో చూసే సినిమాలకు ఇంతేసి రేట్లు పెడితే అసలుకే మోసం వస్తుందని ‘పే పర్ వ్యూ’ దిశగా ఆలోచిస్తున్న ఓటీటీలు అర్థం చేసుకోవాలి.