గుణశేఖర్ నుంచి ఒక ఖండన.. ఒక అప్‌డేట్

సీనియర్ దర్శకుడు గుణశేఖర్ చివరగా తెరకెక్కించిన ‘రుద్రమదేవి’ సినిమా విడుదలై ఐదేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటిదాకా అతడి తర్వాతి సినిమా మొదలే కాలేదు. మరోసారి భారీ కల కన్న గుణ.. హిరణ్యకశ్యప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాడు. కానీ ఈ సినిమా పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరుగుతోంది. కాగా అది మొదలయ్యే లోపు గుణ ఒక వెబ్ సిరీస్ చేయాలనుకున్నాడని.. నెట్‌ఫ్లిక్స్ వాళ్లతో ఒప్పందం కుదిరి దాని మీద వర్క్ చేశాడని.. ఐతే గుణ పనితీరు నచ్చక నెట్‌ఫ్లిక్స్ వాళ్లు ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి.

దీనిపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఖండన ఇచ్చేశాడు గుణ. తాను నెట్‌ఫ్లిక్స్‌తో కానీ.. మరే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో కానీ అసోసియేట్ కాలేదని.. తనకసలు వెబ్ సిరీస్‌లు చేసే ఆలోచన కానీ, ఆసక్తి కానీ ఎంతమాాత్రం లేవని.. కాబట్టి తన గురించి లేని పోని వార్తలు సృష్టించవద్దని అతను ఈ స్టేట్మెంట్లో పేర్కొన్నాడు.

ఇదిలా ఉండగా తన నుంచి అతి త్వరలోనే ఒక అప్‌డేట్ రాబోతోందని.. దాని కోసం ఎదురు చూడాలని గుణశేఖర్ చెప్పాడు. మరి ఇంత బలంగా చెప్పాడంటే గుణశేఖర్-నెట్‌ఫ్లిక్స్ వ్యవహారం ఉత్తుత్తిదే అనుకోవాలి. ఇక గుణ ఇచ్చే అప్ డేట్‌ ఏంటి అన్నది ఆసక్తికరం. బహుశా అది ‘హిరణ్యకశ్యప’కు సంబంధించిందే అయ్యుంటుందని భావిస్తున్నారు.

రానా ప్రధాన పాత్రలో సురేష్ బాబు ఈ మెగా ప్రాజెక్టును నిర్మించడానికి రెడీ అయినట్లు ఇంతకుముందు సంకేతాలందాయి. కానీ కరోనా దెబ్బకు లెక్కలన్నీ తారుమారైన పరిస్థితుల్లో రూ.200 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కించడం పెద్ద రిస్క్ అన్న ఉద్దేశంతో సురేష్ బాబు తటపటాయిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు గురించి గుణ ఏం అప్‌డేట్ ఇస్తాడో చూడాలి.