జగన్ రూపంలో గాంధీ మళ్లీ పుట్టాడా?

మహాత్మా గాంధీజీతో ఆయన కాలంలోని మహా నాయకుల్ని పోల్చినా కూడా అభిమానులకు రుచించదు. అంత గొప్ప నాయకుడాయన. ఇక రాజకీయాలు పూర్తిగా భ్రష్టుపట్టిపోయిన తర్వాతి కాలంలో గాంధీతో ఎవరినైనా పోల్చడం అంటే సాహసమే. ముందు తరంలో అయినా వాజ్‌పేయి లాంటి గొప్ప నేతలున్నారు కానీ.. ఇప్పటి నేతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ప్రస్తుత నాయకుల్లో ఒక మంచి లక్షణాన్ని అభిమానులు చూపిస్తే.. పది ప్రతికూల లక్షణాలను వ్యతిరేకులు బయటపెడతారు. ఇలాంటి తరుణంలో గాంధీతో ఎవరైనా నాయకుడిని పోలిస్తే ఆయన అభిమానుల ఆలోచన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఐతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మహాత్ముడితో పోల్చేశారు ఆ పార్టీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి.

ఐతే ఏదో మీడియా ముందు మాట్లాడుతూ జగన్‌ను మహాత్ముడితో పోల్చి ఊరుకుంటే ఓకే అనుకోవచ్చు. కానీ గాంధీ జయంతి నాడు ఈ పోలికతో ఆయన ఒక వ్యాసం రాశారు. దాన్ని సాక్షి పత్రిక ప్రచురించింది కూడా. ‘గాంధీజీ మళ్లీ పుట్టాడు’ అనేది హెడ్డింగ్. ఇక వ్యాసం అంతటా గాంధీజీ ఆలోచనల్నే జగన్ అమలు చేస్తున్నట్లుగా చెబుతూ జగన్‌ను పొగడ్తల వర్షంలో ముంచెత్తారాయన.

గ్రామ స్వరాజ్యం, రైతుల గురించి గాంధీ చెప్పిన మాటల్ని ఉటంకిస్తూ.. ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు లాంటి ముందు నుంచే ఉన్న పథకాలను ప్రస్తావించి జగన్ సర్కారు రైతులకు గొప్ప సాయం చేస్తోందని పేర్కొన్నారు రామకృష్ణారెడ్డి. ఇక మద్య నిషేధం కోసం గాంధీజీ పోరాడిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీలో మద్యం ధరలు భారీగా పెంచడం ద్వారా మద్యం పట్ల జనాల్లో వ్యతిరేకత పెంచి పరోక్షంగా మద్య నిషేధం దిశగా అడుగులేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇంకా గాంధీజీకి, జగన్‌కు ఏవో పోలికలు పెట్టి.. ఈ తరంలో గాంధీ వారసుడు జగనే అనే సాహసం చేశారు రామకృష్ణారెడ్డి.