సీనియ‌ర్లు.. మీరే ఇలా చేస్తారా? స‌జ్జ‌ల ఫైర్‌..

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్ర‌పురంలో వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుల మ‌ధ్య చోటు చేసుకున్న రాజ‌కీయ తుఫాన్‌పై వైసీపీ అధిష్టానం త‌క్ష‌ణం స్పందించింద‌నే చెప్పాలి. రామ‌చంద్ర‌పురం టికెట్‌ను త‌న కుమారుడికి ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్న రాజ్య‌స‌భ స‌భ్యుడు , మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్ గ‌త రెండు రోజులుగా తీవ్ర హ‌డావుడి చేస్తున్న విష‌యం తెలిసిందే. రామ‌చంద్ర‌పురంలో ఆదివారం ఆయ‌న‌.. మంత్రి, రామ‌చంద్ర‌పురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుకు వ్య‌తిరేకంగా ఉన్న‌వారితో భేటీ అయ్యారు.

పెద్ద ఎత్తున స‌భ పెట్టి చెల్లుబోయిన వ్య‌తిరేక వ‌ర్గాన్ని ప్రోత్స‌హించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా త‌న కుమారుడికే టికెట్ ద‌క్కుతుంద‌ని కూడా చెప్పారు. దీంతో ముస‌లం మ‌రింత పెద్ద‌దైంది. ఈ ప‌రిణామాలను ప‌రిశీలించిన వైసీపీ అధిష్టానం.. వెంట‌నే పిల్లికి పిలుపునిచ్చింది. తాజాగా మంగ‌ళ‌వారం తాడేప‌ల్లి కేంద్ర కార్యాల‌యంలో వైసీపీ నాయ‌కుడు ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిల్లి సుభాష్‌తో భేటీ అయ్యారు. మీరు సీనియ‌ర్‌.. మీరే ఇలా చేస్తే.. పార్టీని రోడ్డున ప‌డేస్తే.. ఎలా అంటూ క్లాస్ తీసుకున్న‌ట్టు తెలిసింది.

టికెట్ల విష‌యాన్ని పార్టీ అధినేత జ‌గ‌న్ ప‌రిశీలిస్తున్నార‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిందేదో జ‌రిగిపోయింది.. అంద‌రూ క‌లిసి మెలిసి ఉండాల‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడిని రాజ‌కీయంగా బ‌రిలో నిల‌పాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సుభాష్ చంద్ర‌బోస్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. త‌మ‌కు రాజ‌కీయంగా ప‌లుకుబ‌డి ఉంద‌ని.. ప్ర‌జా జీవితంలో 40 ఏళ్లుగా ఉంటున్నామ‌ని.. ఇప్పుడు సీటును ఎలా వ‌దులుకుంటామ‌ని తేల్చి చెప్పిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు అంటున్నారు. మొత్తానికి స‌జ్జ‌ల జోక్యం చేసుకున్నా.. ప‌రిణామాలు మాత్రం చ‌ల్ల‌బ‌డిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.