నాయకుడుని అన్యాయంగా బలి చేశారు

చాలా మంది ప్రేక్షకులకు మొన్న శుక్రవారం నాయకుడు విడుదలైన విషయమే తెలియదు. తమిళంలో మామన్నన్ గా మంచి విజయం సొంతం చేసుకున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ ను ఏషియన్, సురేష్ లాంటి సంస్థలు తెలుగులో పంపిణి చేసినప్పటికీ ప్రమోషన్ విషయంలో నిర్లక్ష్యం కారణంగా కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోలేదు. అలా అని ఇదేమి ముక్కుమొహం తెలియని ఆర్టిస్టులున్న సినిమా కాదు. ఉదయనిధి స్టాలిన్ అంతగా పరిచయం లేకపోవచ్చు కానీ వడివేలుకు దశాబ్దాల తరబడి మన ఆడియన్స్ తో కనెక్షన్ ఉంది. హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ కు చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. ఏఆర్ రెహమాన్ సంగీతంలోని పాటలను ప్రత్యేకంగా డబ్బింగ్ చేయించినా ఒక ప్రణాళిక ప్రకారం వాటిని ఆన్ లైన్లో రిలీజ్ చేయలేదు. దీంతో జనానికి చేరాక నాయకుడు కిల్ అయిపోయింది. ఇదొకటి చాలక ఈ నెల 27 న నెట్ ఫ్లిక్స్ లో నాయకుడు అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ మాత్రం దానికి మాతో టికెట్లు కొనిపించడం ఎందుకని మొదటి వారమే చూసిన మూవీ లవర్స్ వాపోతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ లు మెచ్చుకున్న మూవీ ఇది.

ఇలా చేయడం వల్ల క్రమంగా డబ్బింగ్ సినిమాల మీద ఆసక్తి సన్నగిల్లే ప్రమాదం ఉంది. శివ కార్తికేయన్ మహావీరుడు సైతం కేవలం పబ్లిసిటీ లోపం వల్లే యావరేజ్ కంటెంట్ కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఇలాంటివి ఎలాగూ ఓటిటిలో వస్తాయి కదాని ఆడియన్స్ లైట్ తీసుకుంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇంకా ఇబ్బందికరంగా మారతాయి. పొన్నియిన్ సెల్వన్ లాంటి విజువల్ గ్రాండియరే మన జనానికి అంతగా కనెక్ట్ కాలేదు. అలాంటిది ప్రచార హడావిడే లేకుండా నాయకుడు లాంటివి వదిలితే కనీసం థియేటర్ అద్దెలు కూడా రావు. ఇప్పుడు జరిగింది అదే.