కేసీయార్ కు షాక్ ?

జాతీయ రాజకీయాల్లో పరిణామాలు కేసీయార్ కు షాకిచ్చాయనే చెప్పాలి. నరేంద్రమోడీ నాయకత్వంలో ఢిల్లీలో మంగళవారం సాయంత్రం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో మీటింగ్ జరుగబోతోంది. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే మళ్ళీ అధికారంలోకి వచ్చే విషయమై సలహాలు, సూచనలు తీసుకోవటమే సమావేశం ముఖ్యోద్దేశం. ఎన్డీయేని బలోపేతం చేయటంలో భాగంగా భాగస్వామ్య పార్టీలనే కాకుండా కొత్తగా మరో ఎనిమిది పార్టీలను కూడా బీజేపీ సమావేశానికి ఆహ్వానించింది.

సీన్ కట్ చేస్తే 17,18 తేదీల్లో అంటే సోమవారం బెంగుళూరులో ప్రతిపక్షాల సమావేశం మొదలైంది. దీనికి యూపీఏ కూటమితో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా పాల్గొన్నాయి. బెంగుళూరు సమావేశానికి 24 పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించి ఎన్డీయేని దెబ్బకొట్టేందుకు అవసరమైన వ్యూహాలను చర్చించటమే ప్రధాన అజెండా. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఎన్డీయే నుండి కానీ యూపీఏ నుండి కానీ కేసీయార్ కు ఆహ్వానం అందలేదు.

ఎన్డీయే నుండి ఆహ్వానం అందదనే అందరు అనుకున్నారు. అయితే యూపీఏ కూటమి+ప్రతిపక్షాల నుండి కేసీయార్ కు ఆహ్వానం అందవచ్చని అనుకున్నారు. ఎందుకంటే రెడు కూటములు కూడా తమ బలాన్ని పెంచుకోవాలనే అనుకుంటున్నాయి. అందుకనే కొత్త పార్టీలను భాగస్వాములుగా చేసుకుంటున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరని అందరికీ తెలిసిందే. అవసరాలే పార్టీలను కలుపుతాయి.

ఇలాంటి అవసరాల్లో కూడా కేసీయార్ ను ఎన్డీయే, యూపీఏ కూటములు దగ్గరకు తీసుకోవాలని అనుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే రెండు వైపుల పార్టీలూ కేసీయార్ ను ఏమాత్రం నమ్మటంలేదని అర్ధమైపోతోంది. మరిలాంటి పరిస్ధితుల్లో కేసీయార్ జాతీయ రాజకీయాల్లో ఏ విధంగా చక్రంతిప్పగలరు ? వాళ్ళు ఆహ్వానించి కేసీయార్ హాజరుకాకుండా ఉండుంటే అప్పుడు కేసీయార్ ఇమేజి బాగా పెరిగిపోయేది. కానీ అలా కాకుండా అసలు కేసీయార్ ను ఎవరూ గుర్తించనే లేదు. నిజంగా ఇది కేసీయార్ కు షాకింగ్ అనే చెప్పాలి. మరి దీనిపై కేసీయార్ ఎలా స్పందిస్తారు ? భవిష్యత్ వ్యూహాలు ఎలాగుంటాయో ఆసక్తికరంగా మారింది.