‘ఔను.. ప‌వ‌న్‌కు ప్రాణ‌హాని ఉంది..’

బీజేపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, క‌డ‌ప‌కు చెందిన ఆది నారాయ‌ణరెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఔను. పవ‌న్‌కు ప్రాణ‌హాని ఉంది. నాకు కూడా ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంది. అధికారం ద‌క్కించుకునేందుకు, డ‌బ్బు సంపాయించుకు నేందుకు జ‌గ‌న్ ఏమైనా చేస్తారు. ఎంత‌కైనా తెగిస్తారు అని ఆది నారాయ‌ణ‌రెడ్డి తాజాగా వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ ఇటీవల తనకు ప్రాణహానీ ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై ఆది తాజాగా స్పందించారు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘‘నాకు ప్రాణహాని ఉందనే విషయాన్ని నేను ఎప్పుడో చెప్పాను.. పవన్ కళ్యాణ్‌కు ప్రాణహాని ఉందనే అంశాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారు’’ అని అన్నారు. జగన్ ప్ర‌భుత్వ ఏర్పాటే విధ్వంసక రచన అని.. ఎవరు అడ్డొచ్చినా వారిని అడ్డు తొల‌గించుకునే రకమే వైఎస్ కుటుంబం“ అని వ్యాఖ్యలు చేశారు. పవన్ ఎదిగితే తట్టుకుంటారా?.. అందులో బీజేపీతో అంటే ఇంకా అంతే అని అన్నారు. సూపారీ బ్యాచ్, గంగిరెడ్డి, పులివెందుల బ్యాచ్ ఎవరు వస్తారనేది తెలియదన్నారు.

వారికి హత్య చేయడం కోడిని కోసిన అంత సులభమని ఆదినారాయ‌ణ‌రెడ్డి వ్యాఖ్యానించారు. అంత ఈజీగా మర్డర్ చేస్తారంటూ విరుచుకుపడ్డారు. అధికారం కోసం ఏమైనా చేస్తారని… వాళ్లకు డబ్బు కూడా కావాలి అంతే అని అన్నారు. ల‌క్ష‌ల‌ కోట్ల రూపాయ‌లు సంపదించినా జ‌గ‌న్ కు ఆశ తీరదన్నారు. జగన్ అల్లుళ్లను కర్ణాటక, తమిళనాడుకు సీఎంలను చేసినా ఆయనకు ఆశ తీరదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి ఇలాంటి దరిద్రుడు అవసరమా అని ఆదినారాయ‌ణ రెడ్డి ప్రశ్నించారు. జగన్‌కు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి ముందే తెలుసన్నారు. పవన్ భద్రత విషయంలో బీజేపీ, కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్‌కు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్‌కు ప్రమాదం ఉందని.. ఆయనకు వై కేటగిరీతో భద్రత కల్పించాలని అన్నారు. అమిత్ షా, నడ్డాలు ఏపీలో మోడీ పాలన ఎలా ఉందనే దానిపై సంకేతాలు ఇచ్చారని తెలిపారు.

ఏపీలో ఇళ్ల కోసం కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్స్ వేసుకుందని ఆదినారాయ‌ణ‌రెడ్డి విమర్శించారు. లిక్కర్ కింగ్‌లు స్టిక్కర్ కింగ్‌లుగా మారారన్నారు. ఏపీలో ప్రతి దాంట్లో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. సాఫ్ట్‌వేర్‌లో నడ్డా చెపితే, అమిత్ షా హార్డ్ వేర్‌లో చెప్పారన్నారు. అమిత్ షా మాట్లాడిన తీరుకు వైసీపీ భయపడిందని పేర్కొన్నారు.