ఇరవై ఏళ్ళ సినిమాకి వెయ్యి షోలు

ఎల్లుండి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కాబోతున్న సింహాద్రి సందడి మాములుగా లేదు. నిన్న విశ్వక్ సేన్ అతిథిగా చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. తారక్ అంటే విపరీతమైన అభిమానం చూపించే దాస్ స్టేజి మీద కూడా అదే ప్రదర్శించాడు. ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందట వచ్చిన సినిమాకు వెయ్యి షోలతో రీ రిలీజ్ ప్రపంచంలో ఎక్కడా ఉండదని  ఇందులో తానూ భాగం కావడం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు. మైత్రి నవీన్, గోపిచంద్ మలినేని తదితరులు ముఖ్యఅతిథులుగా విచ్చేయగా నిర్వాహకులు ఓ రేంజ్ హడావిడి చేశారు

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ సింహాద్రిని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో 2003లో వచ్చిన ఈ ఇండస్ట్రీ హిట్ ని అప్పట్లో థియేటర్ అనుభూతి చెందని ఫ్యాన్స్ అందరూ మే 20 కోసం ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్వింగ్ లో ఉన్నాయి. ప్రధాన కేంద్రాల్లో ఉదయం షోలు దాదాపుగా ఫుల్ అయ్యాయి. ఎలాగూ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ మాస్ కంటెంట్ మూవీ లేదు కాబట్టి కొత్త జనరేషన్ ప్రేక్షకులు కూడా ఆ యుఫోరియాని ప్రత్యక్షంగా చూసేందుకు సింహాద్రికి ఓటేసే అవకాశం లేకపోలేదు.

పోకిరి, జల్సా, ఖుషి రేంజ్ లో సింహాద్రి రికార్డులు సృష్టించడం ఖాయమని యంగ్ టైగర్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇంతకు ముందు రీ రిలీజ్ కు నోచుకున్న బాద్షా, ఆంధ్రావాలాలు ఆశించిన స్థాయి స్పందన దక్కించుకోలేదు. కేవలం ట్రెండ్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో యావరేజ్ ఫ్లాపులని వదిలారని ఇప్పుడు అసలైన మాస్ బొమ్మ వస్తోందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడీ రీ రిలీజ్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తుంటే రాబోయే రోజుల్లో సక్సెస్ మీట్లు జరిగినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. మరి 31న సూపర్ స్టార్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడుని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి