వ‌చ్చేది కురుక్షేత్రం.. గెలిచేది పాండ‌వులే

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికలను ఆయ‌న కురు క్షేత్ర సంగ్రామంగా అబివ‌ర్ణించారు. ఈ కురుక్షేత్రంలో కౌరవ వధ చేసి.. గెలిచేది పాండ‌వులేన‌ని అన్నారు. అంతేకాదు.. మళ్లీ గౌర వంగా అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పారు. నవంబరు, డిసెంబరుల్లో ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ చూస్తున్నారని, రేపు ఎన్నికలు పెట్టినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..’ కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖ పట్నం జిల్లా పెందుర్తిలో రోడ్ షో నిర్వహించారు.

అనంతరం సభలో ప్రజలనుద్దేశించి చంద్ర‌బాబు ప్రసగించారు. జగన్మోహన్‌రెడ్డి వద్ద ధన బలం ఉంటే, తమ వద్ద ప్రజా బలం ఉంద న్నారు. డబ్బును అడ్డంగా పెట్టుకుని రెచ్చిపోవద్దని, గెలిచేది టీడీపీయేనని… గెలిపించేది ప్రజలేనని స్పష్టంచేశారు. రాజధాని ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్లు ఇచ్చేందుకు 5 శాతం భూమిని రిజర్వు చేశానని చంద్ర‌బాబు చెప్పారు. కానీ ఈ సైకో ముఖ్య మంత్రి ఇప్పుడు ఒకే చోట వేయి ఎకరాల్లో సెంటు భూమి చొప్పున ఇస్తానంటూ పేదలను మోసం చేస్తున్నాడని, వాళ్ల ఉసురు తగలక మానదని హెచ్చరించారు.

సెంటు భూమి సమాధి కట్టుకోవడానికి తప్ప.. దేనికీ పనికిరాదని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “రాష్ట్రాన్ని సైకో ముఖ్య మంత్రి పాలిస్తున్నాడు. వైసీపీకే చెందిన ఎంపీ రఘురామకృ ష్ణంరాజును సీఐడీ అధికారులతో కొట్టించాడు. ఆయన బాధపడుతుంటే వీడియో తీయించి చూసి ఆనందం పొందిన గొప్ప సైకో. మొన్న రాజమండ్రిలో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుటుంబాన్ని వేధించారు. ఫిర్యాదు ఇచ్చేవాళ్లూ వాళ్లే.. విచారణ చేసేవాళ్లు, చివరకు ఇబ్బందులు పెట్టేవాళ్లు కూడా వైసీపీ వాళ్లే. బాబాయి వివేకానందరెడ్డిని హత్య చేసి నాపై నెట్టే యత్నం చేశారు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

జగన్ సైకో కాదని నిరూపించుకోవాల‌ని చంద్ర‌బాబు స‌వాల్ రువ్వారు. “ఒక కన్ను రెండో కన్నును పొడుస్తుందా అన్నాడు. ఒక బాబాయిని చంపి.. మరో బాబాయిని జైలుకు పంపించాడు. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 5.30 గంటలకు ఎన్నికల ప్రణాళిక కోసం మీటింగ్ పెట్టిన జగన్.. తన బాబాయి గుండెపోటుతో చనిపోయినట్లు అజేయ కల్లం తదితరుల సమక్షంలో వెల్లడించాడు. గుండెపోటు అని ఆయనకు ఎలా తెలిసింది?” అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

ఇప్పుడు తాను ఉంటున్న ఇంటిని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్ర‌బాబు అన్నారు. త‌న‌కు జగన్మోహన్ రెడ్డి మాదిరిగా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇడుపులపాయ, కడప, పులివెందుల్లో ప్యాలెస్‌లు లేవని చెప్పారు. అద్దె ఇంట్లో ఉంటున్నాను.. అద్దె కడుతున్నానని చెబుతున్నప్పటికీ క్విడ్ ప్రో కో జరిగిందంటున్నారని అన్నారు. రింగురోడ్డు పేరుతో కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసాన్ని ఈ సైకో కొనసాగిస్తున్నాడని బాబు మండిప‌డ్డారు.