కాబోయే సీఎం సిద్ధరామయ్యే?..ఖండించిన కాంగ్రెస్ ఇన్ చార్జి

కర్ణాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి కాంగ్రెస్ సీట్లు సాధించింది. కానీ, ఆ విజయాన్ని ఆస్వాదించాల్సిన తరుణంలో సీఎం అభ్యర్థి ఎంపిక వ్యవహారంతో కాంగ్రెస్ హైకమాండ్ మూడ్రోజులుగా సతమతమవుతోంది. కన్నడనాట కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొనే ఉండటం చర్చనీయాంశమైంది.

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ లలో ఎవరిని సీఎం చేయాలి అన్న విషయంపై కాంగ్రెస్ హై కమాండ్ తల పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే సిద్ధరామయ్యను సీఎం చేయాలని హై కమాండ్ నిర్ణయించిందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి సర్ది చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇక, చెరి రెండున్నరేళ్లు పదవిని పంచుకునేందుకు డీకే ససేమిరా అన్నారని ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు, రేపు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కూడా వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆ ప్రచారాన్ని కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి రణ్ దీప్ సుర్జేవాలా ఖండించారు. కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం వస్తున్నవి పుకార్లేనని కొట్టిపారేశారు. ఈరోజో రేపో సీఎం అభ్యర్థి ఎవరు అన్న విషయంపై స్పష్టమైన ప్రకటన ఇస్తామని అన్నారు. రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం జరగబోతోంది అని వస్తున్న వదంతులు నిజం కాదని ఖండించారు.