‘టైగర్’ ప్లానింగ్ మామూలుగా లేదు

బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఇమేజ్ కోసం చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ చాలామందికి తిరస్కారమే ఎదురైంది. ‘సైరా’తో చిరంజీవి చేసిన ప్రయత్నం కూడా పెద్దగా ఫలితాన్నివ్వలేదు. కానీ ‘పుష్ప’తో అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టారే కాక.. ‘కార్తికేయ-2’తో నిఖిల్ లాంటి చిన్న హీరో కూడా అనుకోకుండా పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు.

‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల ఇమేజ్, మార్కెట్ కూడా విస్తరించింది. ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం గట్టిగా ప్రయత్నం చేయబోతున్న హీరో.. మాస్ రాజా రవితేజ. ఇంతకాలం నాన్-తెలుగు మార్కెట్ గురించి రవితేజ ఎప్పుడూ పెద్దగా పట్టించుకున్నది లేదు. ఆయన డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్‌లో ఆదరణ తెచ్చుకుని నార్త్‌లో గుర్తింపు తెచ్చినా.. మాస్ రాజా మాత్రం పనిగట్టుకుని తన సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు.

కానీ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో తెలుగేతర మార్కెట్లను కొల్లగొట్టగలం అని బలంగా నమ్ముతున్నాడట రవితేజ. ఈ సినిమా కంటెంట్.. దీని ప్రి ప్రొడక్షన్ వర్క్ అంతా చూసి ఆయన చాలా ధీమాగా ఉన్నట్లు సమాచారం. రవితేజ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆయన ఆల్రెడీ ‘కార్తికేయ-2’తో పాన్ ఇండియా సక్సెస్ రుచి చూశాడు. ‘టైగర్ నాగేశ్వరరావు’ ప్రమోషన్లను ఆయన పెద్ద రేంజిలోనే ప్లాన్ చేశారు. ఏదో మొక్కుబడిగా ఇతర భాషల్లో రిలీజ్ చేయడం కాకుండా.. ఒక పద్ధతి ప్రకారం ప్రమోట్ చేసి సినిమాను ఆయా భాషల్లో థియేటర్లలోకి దించాలనుకుంటున్నారు.

ఇందుకోసం ఒక్కో భాషలో ఒక్కో పెద్ద స్టార్‌ను ప్రమోషన్ కోసం ఉపయోగించుకోబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా కన్నడ కోసం శివరాజ్ కుమార్‌ను ఎంచుకున్నారు. ఆయనే ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ గ్లింప్స్‌కు కన్నడలో వాయిస్ ఇవ్వడమే కాక సోషల్ మీడియాలో ప్రమోట్ కూడా చేయబోతున్నారు. ఇలా ప్రతి భాషకూ ఒక పెద్ద స్టార్‌తో అసోసియేట్ అవుతున్నారు. వంశీ ఆకెళ్ళ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు రిలీజ్ చేయబోతున్నారు. ఆ లోపు ప్రమోషన్లు హోరెత్తబోతున్నాయి.