ఎన్నికల బరిలో సునీతా రెడ్డి ?

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ వేగవంతమైంది. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టుతో కేసు ఒక కొలిక్కివచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. ఆయన కుమారుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా లేదా అన్నది తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను బట్టి ఉంటుంది. వివేకా కేసులో ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతుండగానే ఇప్పుడు మరో ఆంశం తెరపైకి వచ్చింది..

కడపలో సునీత పోటీ

అవినాష్ రెడ్డి చేసిన ద్రోహానికి వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించి తీరాలని వివేకా కుమార్తె సునీతా రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈ సంగతి లీక్ కావడంతో సోషల్ మీడియాలో ఇప్పుడో వార్త ప్రచారానికి వచ్చింది. కడప ఎంపీగా సునీతా రెడ్డి పోటీ చేస్తారని కొందరంటున్నారు. వైద్యురాలిగా ఆమెకు మంచి పేరు ఉంది. ఆమె ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగిన పక్షంలో కర్ణాటకలో నటి సుమలత తరహాలో విజయభేరీ మోగిస్తారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సునీతా రెడ్డి రంగంలోకి దిగిన పక్షంలో వైసీపీయేతర పార్టీలన్నీ ఆమెకు మద్దతిచ్చే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. వైసీపీని గద్దెదించి శంకరగిరి మాన్యాలు పట్టించడమే ధ్యేయంగా రాజకీయాలు నడుపుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సునీతకు బహిరంగ మద్దతు ప్రకటించే అవకాశాలు ఉంటాయట..

జగన్ కు గడ్డుకాలమే…

సునీత ఎన్నికల బరిలోకి దిగిన పక్షంలో సీఎం జగన్ కు టెన్షన్ పెరగడం ఖాయంగా చెబుతున్నారు ఆమె కడప ఎంపీ సీటుకు పోటీ చేసిన పక్షంలో దాని పరిధిలో ఉండే అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లపై దాని ప్రభావం ఉంటుంది. అప్పుడు జగన్ పోటీ చేసే పులివెందులలోనూ ఆయనకు కష్టకాలం తప్పకపోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే పులివెందులలో ఎదురుగాలి వీస్తున్న సంకేతాలు అందాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులకు చెందిన టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో పాటు.. ఆ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు పొంది జగన్ ను ఇబ్బంది పెట్టారు. ఏం జరుగుతుందో చూడాలి..