సమంతపై సోషల్ మీడియా ఎటాక్

సినిమాల పరంగా కానీ, వ్యక్తిగత జీవితం విషయంలో కానీ.. సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. నాగచైతన్య నుంచి విడిపోయాక ఆమె వ్యక్తిగత జీవితం గురించి జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. విడాకులు అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం అయినా.. అందులో ఇద్దరి పాత్ర ఉన్నప్పటికీ.. సమంత మాత్రం ఈ విషయంలో సోషల్ మీడియాకు బాగా టార్గెట్ అయింది.

విడాకులను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె పెట్టిన ఇన్‌డైరెక్ట్ పోస్టులు.. అలాగే ‘ఊ అంటావా ఊహూ అంటావా’ లాంటి ఐటెం సాంగ్ చేయడం వల్ల ఆమె నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది. కానీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా తనకు నచ్చిన తరహాలో ఆమె ముందుకు వెళ్లిపోతోంది. ఐతే సామ్ మరోసారి తన విడాకుల గురించి.. సోషల్ మీడియాలో తనకు ఎదురయ్యే హేట్రెడ్ గురించి చేసిన వ్యాఖ్యలు మళ్లీ పెద్ద చర్చకు దారి తీశాయి.

పెళ్లి విషయంలో తాను నూటికి నూరు శాతం చేయాల్సిందంతా చేశానని.. కానీ అది వర్కవుట్ కాలేదని.. కానీ విడాకులకు సంబంధించి తాను సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చిందని.. అలాగే ‘ఊ అంటావా ఊహూ అంటావా’ పాట చేయడం విషయంలోనూ అభ్యంతరాలు తప్పలేదని ఆమె.. తాను తప్పు చేయనపుడు ఎందుకు భయపడాలి, వెనక్కి తగ్గాలి అని ఆమె ప్రశ్నించింది.

ఐతే ఈ కామెంట్ల విషయంలో సోషల్ మీడియా జనాలు మళ్లీ సమంతను టార్గెట్ చేస్తున్నారు. తన కొత్త చిత్రం ‘శాకుంతలం’కు హైప్ తెచ్చేందుకే సమంత ఈ కామెంట్లు చేసిందని ఆమెను విమర్శిస్తున్నారు. తన సినిమాల రిలీజ్ టైంలో సమంత కావాలనే విడాకులు, సోషల్ మీడియా హేట్రెడ్ విషయంలో అతిగా స్పందిస్తోందని.. విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం ద్వారా సినిమాలకు ప్రయోజనం చేకూర్చాలని చూస్తోందని.. మిగతా సమయాల్లో కాకుండా కేవలం తన సినిమాలు రిలీజవుతున్నపుడే ఈ రకమైన కామెంట్లు చేయడంలో ఆమెకు వేరే ఉద్దేశాలు ఉన్నాయని ఒక వర్గం సమంతను అదే పనిగా టార్గెట్ చేస్తుండటం గమనార్హం.