చిరంజీవిని మార్చిన విశ్వనాథ్

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడే కాదు సినిమాల నుంచి విరామం తీసుకోవడానికి ముందు చాలా ఏళ్లు కమర్షియల్ సినిమాలే చేశాడు. కానీ 90వ దశకం, అంతకుముందు ఆయన ఇమేజ్ చూసుకోకుండా కథా ప్రాధాన్యమున్న అద్భుతమైన సినిమాల్లో నటించాడు. విజేత, రుద్రవీణ, ఆరాధన, శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధవుడు.. ఇలా ఆయన కెరీర్లో మైలురాళ్లుగా చెప్పుకోదగ్గ అద్భుత చిత్రాలు చాలానే ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా విశ్వనాథ్ తెరకెక్కించిన శుభలేఖ, స్వయంకృషి, ఆపద్బాంధువుడు చిత్రాల గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే. అభినయ పరంగా చిరంజీవి కెరీర్లో అత్యున్నత స్థానం ఈ చిత్రాలకు దక్కుతుంది.

విశ్వనాథ్‌తో పని చేయడం మొదలయ్యాక నటుడిగా తాను ఎంతో ఎదిగానని.. తనలో గొప్ప మార్పు వచ్చిందని చిరు చెప్పాడు. ఇటీవలే విశ్వనాథ్ పరమపదించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో విశ్వనాథ్ గురించి చిరు గొప్పగా మాట్లాడాడు. తనలో విశ్వనాథ్ తెచ్చిన మార్పు గురించి ఆయనేమన్నారంటే..

‘‘విశ్వనాథ్ గారిని నేను మూడు కోణాల్లో చూస్తాను. మూడు సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడిగా.. అనుక్షణం నా నటనను సరిదిద్దిన గురువుగా.. చిత్రీకరణ సమయంలో నాపై ఎంతో ప్రేమ చూపించిన తండ్రిగా భావిస్తా. నేను నటుడిగా నిలదొక్కుకుంటున్న సమయంలో నాతో ఆయన శుభలేఖ చేశారు. వైజాగ్‌లో తొలి రోజు షూటింగ్ సందర్భంగా నా దగ్గరకు వచ్చి ఆయన.. ‘నిన్ను ఎవరైనా తరుముతున్నారా? అంత వేగంగా డైలాగ్ ఎందుకు చెబుతున్నావు’ అని అడిగారు. కంగారు వచ్చేస్తోంది సార్ అన్నాను. డైలాగ్ చెప్పడంలో నా స్పీడ్ తగ్గించి.. సరిగ్గా చెప్పేందుకు బీజం పడింది అక్కడే. నేనోసారి ఒక బెత్తం లాంటిది పట్టుకుని తిరుగుతుంటే.. ఆ స్టైల్ నచ్చి అలా డ్యాన్స్ చేస్తావా అని అడిగారు. ఆయన చెప్పేంత వరకు నేను క్లాసికల్ డ్యాన్స్ చేయగలనని తెలియదు. నేను వరుసగా మాస్ యాక్షన్ సినిమాలు చేస్తున్న టైంలో ‘స్వయం కృషి’ లాంటి సినిమా చేసి నన్ను సరికొత్తగా ఆవిష్కరించారు. ‘ఆపద్బాంధవుడు’ మా కలయికలో వచ్చిన మరో అపురూపమైన చిత్రం’’ అని చిరు చెప్పారు.