షర్మిల అరెస్టు.. హైదరాబాద్ కు తరలింపు

అనుకున్నట్లే జరిగింది. వైఎస్సార్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. ఆమె పాదయాత్రను కూడా రద్దు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఫిబ్రవరి 18న మహబూబాబాద్ లో ఆమె నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ ను పరుష పదజాలంతో దూషించారన్న ఆరోపణతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన పోలీసులు ఆదివారం ఉదయం షర్మిల కారవాన్ వద్దకు వెళ్లారు. ప్రస్తుతం ఆమె పాదయాత్ర మహబూబాబాద్ సమీపంలోని బేతోలు వద్ద షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. బీఆర్ఎస్ నేత లూనవత్ అశోక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆమెపైన ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేయటం గమనార్హం.

తాను కనుసైగ చేస్తే చాలు.. తమ పార్టీ కార్యకర్తలు తరిమి కొడతారంటూ శంకర్ నాయక్ చేసిన వ్యాఖ్యలపై అంతే ధీటుగా స్పందించారు షర్మిల. శంకర్ నాయక్ సైగ చేయ్.. ఎవడొస్తాడో చూస్తానంటూ సవాలు విసరటంతో పాటు.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదన్న ఆమె మాటలు మంటలు పుట్టేలా మారాయి. ఊహించని రీతిలో ఆమె నుంచి వచ్చిన ఘాటు వ్యాఖ్యలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని పోలీసులు చెబుతున్నారు.

అందుకే ఆమె పాదయాత్రను అడ్డుకొని.. అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయించారు. అందులో భాగంగా ఆమె పాదయాత్ర వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసు వాహనంలో ఎక్కించారు. ఆమెను హైదరాబాద్ కు తరలించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె చేయాల్సిన పాదయాత్రను కూడా అడ్డుకోవాలన్నదే ఆలోచనగా చెబుతున్నారు.

ఘాటు విమర్శలు చేస్తున్న షర్మిల పాదయాత్రకు సమాధానం చెప్పకుండా వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలకు సైతం మంట పుట్టేలా మాట్లాడే విషయంలో షర్మిల సక్సెస్ అవుతున్నారు. వచ్చే నెలలో ఆమె తన పాదయాత్రను ముగించాల్సి ఉంది. అయితే.. అంతవరకు వెళ్లకుండా ఆమె పాదయాత్రకు బ్రేకులు వేసేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.