బీఆర్ఎస్ లో చేరిన మాజీ సీఎం

బీఆర్ఎస్ దిల్లీకి బీజేపీ ఇంటికి అంటూ భారీ డైలాగులు కొడుతున్న కేసీఆర్ తన పార్టీలో చేర్చుకుంటున్న నాయకులను చూస్తుంటే వీరందరినీ పట్టుకుని బీజేపీతో ఎలా పోరాడుతారన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

ఏపీలో తోట చంద్రశేఖర్ వంటి నాయకులను చేర్చుకున్న కేసీఆర్ ఆ తరువాత గుర్తింపు ఉన్న నాయకులను ఎవరినీ ఇంతవరకు తన పార్టీలో చేర్చుకోలేకపోయారు.

మిగతా రాష్ట్రాలలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఇతర రాష్ట్రాల నుంచి నాయకులు వచ్చినా ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ యాక్టివిటీ మాత్రం మొదలుకాలేదు. అంతేకాదు… పార్టీలోకి ఆయన ఎంచుకుంటున్న నాయకులు కూడా పాత తరం నాయకులు, గత రెండు మూడు ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినావారు, ఒకట్రెండు నియోజకవర్గాలను మించి ప్రభావితం చేయలేనివారు కావడంతో వీరందరినీ నమ్ముకుని కేసీఆర్ తన లక్ష్యాన్ని ఎలా చేరుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తాజాగా ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, ఆయన కుమారు శిశిర్ గమాంగ్ బీఆర్ఎస్‌లో చేరడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో వారిద్దరూ బీజేపీకి రాజీనామా కూడా చేశారు. ఇప్పటికే ఓసారి కేసీఆర్‌తో భేటీ అయిన ఈ తండ్రీకొడుకులు త్వరలోనే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

గిరిధర్ గమాంగ్ ఒడిశాకు గతంలో సీఎంగా పనిచేసిన నేత. అంతేకాదు.. తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచారు. ఇదంతా వినడానికి బాగానే ఉన్న ఇప్పుడు ఆయన ఏమిటనేదే ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులుగా తనకు నచ్చినవారిని నియమించుకునే కాలంలో 1999లో గమాంగ్‌ను సీఎం చేసింది. అదే ఏడాది ఆయన పదవి పోగొట్టుకున్నారు కూడా.

కొరాపుట్ నియోజకవర్గం నుంచి ఆయన 9 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 1977 నుంచి 2004 వరకు ఆయన ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉంటూనే ఒడిశాకు సీఎంగా పనిచేసిన ఆయన అదే సమయంలో బీజేపీ ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానంలో వ్యతిరేకంగా ఓటు వేసి వాజపేయి గవర్నమెంటు కూలిపోవడానికి కారణమయ్యారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన భార్య హేమ గమాంగ్ 1999లో కొరాపుట్ ఎంపీగా గెలిచారు. అనంతరం 2004లో గిరిధర్ గమాంగ్ మళ్లీ కొరాపుట్‌లో గెలిచారు.

అనంతరం 2009లో ఆయన ఓడిపోయారు. 2014లోనూ ఓటమిపాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో 2015లో బీజేపీలో చేరారు. కానీ, 2019లో బీజేపీ ఆయన టికెట్ ఇవ్వలేదు.
మరోవైపు గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగో కొరాపుట్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని గుణుపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీ చేసినా ఇంతవరకు సక్సెస్ కాలేదు. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శిశిర్ ఓటమి పాలుకాగా 2019లో బీజేపీకి ఆయనకు టికెట్ ఇవ్వడంతో మరోసారి పోటీ చేశారు. కానీ, 2019లో ఆయన నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు.

ప్రస్తుతం 79 ఏళ్ల వయసులో ఉన్న గిరిధర్ గమాంగ్ ఈసారి బీజేపీ నుంచి తనకు టికెట్ రాదని అర్థం చేసుకునే ఆ పార్టీని వీడారు. సంక్రాంతికి రెండు రోజుల ముందు కేసీఆర్‌ను కలిసి తండ్రీకొడుకులు గిరధర్, శిశిర్ గమాంగ్‌లు తాజాగా బీజేపీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్‌లో త్వరలో చేరనున్నారు. కొరాపుట్ వంటి దట్టమైన ఏజెన్సీ ప్రాంతంలో బీఆర్ఎస్ ఒడిశా ప్రజలకు ఎలా కనెక్టవుతుంది.. గమాంగ్‌లు ఆ పార్టీకి ఎలా ఉపయోగపడతారన్నది అనుమానమే.