గెలిచే సీట్ల‌లోనూ కొంప కొల్లేరే…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి అధికారం చేప‌ట్టాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు వెయ్యి క‌ల‌లు కంటున్నారు. అంతేకాదు.. టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అయితే.. ఏకంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 160 స్థానాల్లో తాము విజ‌యం ద‌క్కించుకుని అధికారం చేప‌డ‌తామ‌ని కూడా ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. గెలుపు మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. అస‌లు గెలిచే నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి ఎలా ఉంద‌నేది ఇప్పుడు ప్ర‌శ్న.

విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, తూర్పు, చింతలపూడి, తిరువూరు, మైలవరం, గన్నవరం, గుడివాడ, గుంటూరు ఈస్ట్, వెస్ట్‌, నెల్లూరు సిటీ, రూర‌ల్‌, సర్వేపల్లిలో పార్టీ ప‌రిస్థితి ఏవిధంగా ఉంది? అంటే.. చెప్పే ప‌రిస్థితి లేదు. ఇక్క‌డ నాయ‌కులు లేరా? అంటే, ఉన్నారు. కానీ, వారిలో వారికి భ‌యం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు టికెట్లు ఇస్తారో లేదో అనే బెంగ‌. దీంతో వారు బ‌ల‌మైన నాయ‌కులే అయిన‌ప్ప‌టికీ.. పార్టీ త‌ర‌ఫున మాత్రం ప‌నిచేయ‌డం లేదు. దీంతోపార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది.

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా.. ప‌క్క చూపులు చూస్తున్నారు. మ‌రి ఆయ‌న జ‌న‌సేన లోకి వెళ్తారో.. లేక వైసీపీలోకే వెళ్తారో తెలియదు. ఇక‌, తూర్పులో ఉన్న ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌ను గ‌న్న‌వ‌రం వెళ్లాల‌ని చెబుతున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న దానికి ఒప్పుకోవ‌డం లేదు. దీంతో ఆయ‌న కూడా అన్య‌మ‌నస్కంగానే ఉన్నారు. చింత‌ల‌పూడిలో మాజీ మంత్రి పీత‌ల సుజాత‌.. ఉన్నా.. ఆమెకు కూడా ఇదే భ‌యం ఉంది. తిరువూరులో ఎవ‌రు పోటీ చేస్తారంటే.. క్లారిటీ లేదు.

మైల‌వ‌రం దేవినేని ఉమాదే అని చెబుతున్నారు. కానీ, ఆయ‌నను కూడా మారుస్తార‌ని.. గ‌న్న‌వ‌రం పంపి స్తార‌ని అంటున్నారు. ఇది మ‌రింత చ‌ర్చ‌కు దారితీస్తోంది. గుడివాడ‌లో అస‌లు అభ్య‌ర్థే లేడు. ఉన్న బ‌చ్చుల అర్జునుడుకు.. త‌న‌కు ఎలానూ సీటివ్వ‌రు కాబ‌ట్టి.. మ‌మ అని అనిపిస్తున్నారు. గుంటూరు ఈస్ట్ ప‌రిస్థితి మ‌రింత దారుణం.

వ‌రుస ప‌రాజయాల‌తో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ జెండా ఎగిరే ప‌రిస్థితి లేదు. మ‌రోవైపు.. ప‌శ్చిమలో పార్టీ మారిన గిరినే తిరిగి పిలుస్తున్నార‌ని అంటున్నారు. ఇలా.. ఒక‌టి కాదు.. ప‌దుల సంఖ్య‌లో నియోజ‌క‌వ‌ర్గాల్లో క్లారిటీ లేకుండా.. చంద్ర‌బాబు ఎన్ని ప్ర‌యోగాలు చేసినా.. అవి ఫ‌లిత‌మిచ్చేవి కాద‌నే టాక్ సొంత నేత‌ల మ‌ధ్యే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.