జనాన్ని థియేటర్లకు రప్పించే ఎత్తుగడ

ఒకప్పుడు కొత్త సినిమాలు వస్తే చాలు వీకెండ్ మాములు రోజులు అనే తేడా లేకుండా కనీసం వారంపాటు థియేటర్లు జనంతో కళకళలాడేవి. ఇప్పుడా ట్రెండ్ మారిపోయింది. పబ్లిక్ బాగా బిజీ అయిపోయారు. శని ఆదివారాలు తప్పించి మిగిలిన టైంలో అదే పనిగా హాలుకు వచ్చే సమయం ఉండటం లేదు. స్టార్ హీరోలకు ఇబ్బంది లేదు. ఎలాగోలా ఆడియన్స్ వస్తారు. ఎటొచ్చి మీడియం రేంజ్, బాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ కి పెద్ద తంటా వచ్చి పడింది. ముఖ్యంగా మల్టీప్లెక్సులకు ఈ సమస్య తీవ్రం. ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఆరు దాకా కనీస టికెట్లు తెగక క్యాన్సిలవుతున్న షోలు బోలెడు

అందుకే సదరు కంపనీలు కొత్త ఎత్తుగడలతో మూవీ లవర్స్ ని రప్పించే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా పివిఆర్ ఒక పధకాన్ని తీసుకొచ్చింది. పదిహేను వందలు ఒక్కసారి కడితే చాలు మూడు నెలల్లో ముప్పై సినిమాలు చూసేయొచ్చు. అంటే ఒక్క టికెట్ కేవలం 50 రూపాయలు పడుతుంది. ఎలా చూసుకున్నా ఇది డెడ్ చీప్ ఆఫర్. ఈ ధరలో రీ రిలీజులు కూడా రావడం లేదు. కాకపోతే నెలకు పది అంటే వారానికి కనీసం రెండు లేదా మూడు సినిమాలు చూడాల్సి ఉంటుంది. అది కూడా సోమవారం నుంచి శుక్రవారం మాత్రమేననే మెలిక పెట్టారు. ఊరట ఏంటంటే ఫ్రైడే రిలీజులను ఎంజాయ్ చేయొచ్చు.

ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేశారు. మరికొన్ని నగరాలకు విస్తరించే ఆలోచన జరుగుతోంది. ఏదైతేనేం ఇదో మంచి ఎత్తుగడనే. సింగల్ స్క్రీన్లు సైతం ఇలాంటి ఆలోచనతో ముందుకెళ్తే తప్ప రాబోయే రోజుల్లో ఆక్యుపెన్సీలు కష్టంగా ఉండేలా కనిపిస్తున్నాయి. అసలే థియేటర్లకు పోటీగా ప్రతివారం ఓటిటిలలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు, టాక్ షోలంటూ విపరీతమైన కంటెంట్ అందుబాటులోకి వస్తోంది. అలాంటాప్పుడు డబ్బు టైం ఖర్చు పెట్టుకుని కస్టమర్ రావాలంటే ఏదో ఒక మేజిక్ జరిగే తీరాలి. ఇదేదో రాబోయే రోజుల్లో మార్పుకు సూచనగా కనిపిస్తోంది