దిల్ రాజుకు నిర్మాతల మండలి షాక్

అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ మధ్య తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తన నిర్మాణంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా కోసం కార్తికేయ-2ను వాయిదా వేయించాడనే ఆరోపణలు ఎదుర్కొన్న ఆయనకు అప్పుడు బాగానే డ్యామేజ్ జరిగింది. కవర్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక ఇప్పుడేమో తన ప్రొడక్షన్లో రానున్న కొత్త చిత్రం వారసుడుకు నైజాం ఏరియాలో సంక్రాంతికి ఎక్కువ స్క్రీన్లు అట్టిపెట్టుకుంటున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారాయన.

గతంలో తమిళ చిత్రం పేటకు థియేటర్లు ఇచ్చే విషయమై వివాదం తలెత్తినపుడు.. పండుగలకు తెలుగు సినిమాలను కాదని వేరే భాషా చిత్రానికి ఎలా స్క్రీన్లు ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో తమిళ అనువాద చిత్రమే అయిన వారసుడు కోసమని ఎక్కువ థియేటర్లు కేటాయిస్తుండడం దుమారం రేపుతోంది.

దీనిపై ఇప్పటికే చిరంజీవి, బాలయ్య అభిమానులు దిల్ రాజును టార్గెట్ చేశారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలను కాదని వారసుడు కు ఎక్కువ స్క్రీన్లు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. ఐతే ఎవరో నెటిజన్లు విమర్శలు చేయడం వేరు. కానీ ఇప్పుడు తెలుగు నిర్మాతల మండలి ఈ విషయమై ఏకంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 12న జరిగిన ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం సందర్భంగా పండుగలప్పుడు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలకే మెజారిటీ థియేటర్లు ఇవ్వాలన్న నిర్ణయం జరిగిందనే విషయాన్ని ఈ ప్రెస్ నోట్లో ప్రస్తావించారు.

అంతే కాక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దిల్ రాజు పాత వీడియోను ఉటంకిస్తూ అప్పటి మాటలకు దిల్ రాజు కట్టుబడి సంక్రాంతికి తెలుగు చిత్రాలకే అధిక ప్రాధాన్యం దక్కేలా చూడాలని పేర్కొన్నారు. మీడియాలో, సోషల్ మీడియలో విమర్శలను అయితే పట్టించుకోకుండా ఉండిపోవచ్చు కానీ ఇలా నేరుగా నిర్మాతల మండలే లేఖ రాయడం అంటే దిల్ రాజుకు పెద్ద షాకే. ఇప్పుడాయన ఏం చేస్తారో చూడాలి మరి.