గుంతలు పూడ్చరు.. రోడ్లు విస్తరిస్తారా.. సిగ్గుందా?

జనసేనాని పవన్ కళ్యాణ్ ఏదైనా కార్యక్రమం కోసం ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టారంటే మొత్తం మీడియా దృష్టి అటు వెళ్లిపోతోంది. ఆ రోజుకు వార్తల్లో వ్యక్తి ఆయనే అవుతున్నారు. శనివారం కూడా అదే జరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి సమీపంలోని ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చిన ఘటన సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే.

రోడ్డు విస్తరణ పేరు చెప్పి ఇప్పటంలో పదుల సంఖ్యలో ఇళ్లు కూలగొట్టిస్తున్నారు. పైకి రోడ్డు విస్తరణ అని కారణం చెబుతున్నప్పటికీ.. ఈ గ్రామంలో కొందరు జనసేన ప్లీనరీ కోసం తమ భూములను ఇచ్చారన్న కక్షతోనే జగన్ సర్కారు ఈ పని చేస్తోందన్న అనుమానాలు గట్టిగా వ్యక్తమవుతున్నాయి. అక్కడి జనాలు ఇదే విషయం మీడియా దగ్గర ప్రస్తావిస్తున్నారు. తమ పార్టీ కార్యక్రమానికి స్థలం కేటాయించడం వల్ల ఇళ్లు కోల్పోయి రోడ్డున పడుతున్న బాధితులకు అండగా నిలిచేందుకు ఆలస్యం చేయకుండా జనసేనాని ఇప్పటంకు చేరుకున్నారు.

ఐతే పవన్ కళ్యాణ్‌ను ఇప్పటం గ్రామానికి చాలా దూరంలోనే పోలీసులు ఆపేశారు. ఆయన వాహనం ముందుకెళ్లకుండా చేశారు. ఐతే దీనికి వెరవకుండా జనసేన శ్రేణులతో కలిసి పాదయాత్రగా పవన్ ఇప్పటంకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పవన్ జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలోనే దుయ్యబట్టారు. సిగ్గుందా ఈ పనికి మాలిన ప్రభుత్వానికి అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు.

“రాష్ట్రంలో రోడ్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. గుంతలు పూడ్చలేరు. కొత్త రోడ్లు వేయలేరు. అలాంటిది రోడ్లు విస్తరణ చేస్తారా? సిగ్గుందా ఈ పనికి మాలిన ప్రభుత్వానికి? పోలీసులు ప్రభుత్వానికి అనుకూలంగా అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అలా అని వాళ్లతో మనం ఘర్షణ పడకూడదు. జనసైనికులందరికీ ఒకటే చెబుతున్నా. పోలీసుల బాధల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్లు మనల్ని అడ్డగిస్తే గొడవ పడకూడదు. అలా అని వెనుకంజ వేయకూడదు. చేతులు కట్టుకుని అలాగే ముందుకు వెళ్లిపోవాలి. మన పోరాటాన్ని కొనసాగించాలి’’ అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.