ఏపీలో ఆ డ‌బ్బులు ఏమ‌వుతున్నాయ్ బ్రో!!

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చుకుంటే బాగానే ఆదాయాన్ని స‌మ‌కూర్చుకుంటోంది. పెట్టుబడులు, ప‌రిశ్ర‌మల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఇత‌ర ఆదాయ మార్గాలైన ప‌న్నులు, స‌ర్ చార్జీలు, వ్యాట్ ఇలాంటి వాటి రూపంలో ప్ర‌జ‌ల నుంచి బాగానే పిండుతున్నారు. ముఖ్యంగా ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఎక్క‌డా లేని చెత్త‌పై ప‌న్నును వ‌సూలు చేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం ఏపీనే! ఇక‌, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు కూడా ఆకాశాన్ని అంటుతున్న రాష్ట్రం, ప‌న్నులు వేసేస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే.

సో.. వీటి వ‌ల్ల ఏపీ ప్ర‌భుత్వానికి బాగానే సొమ్ములు స‌మ‌కూరుతున్నాయి. అయితే, వీటికి లెక్క‌లు ఏవీ? అంటే మాత్రం చెప్ప‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పోనీ.. ఉద్యోగుల‌కు స‌మ‌యానికి జీతాలు ఇస్తున్నారా? అంటే లేదు. ప్ర‌స్తుత ప్రభుత్వంలో ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందడం అనేది కలగా మిగిలి పోతోంది. ఈ నెల ఇంకా ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కలిపి రూ.1300 కోట్లు చెల్లించాల్సి ఉంది. నెల నెలా ఇదేతంతుగా కూడా మారిపోయింది.

అంద‌రికీ జీతాలు అందేసరికి నెలలో 20వ తేదీ వస్తోంది. దాదాపు రెండున్నరేళ్లుగా ఇదే కొనసాగుతోంది. ఖజానాకు వచ్చే వేల కోట్ల ఆదాయం నుంచి ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఎలాంటి ఆటంకం లేకుండా ఇవ్వొచ్చు. కానీ, ప్రభుత్వం మాత్రం ప్రతి నెలా ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు ఆపుతోంది. ఈ నెలలో ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు పడలేదు.

ఆదాయం స‌రే.. అప్పులేమ‌య్యాయి?

ఏపీ ఆదాయం సంగ‌తి అలా ఉంచితే.. ఆర్‌బీఐ నుంచి రూ.2,500 కోట్ల వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఎస్‌డీఎఫ్ కింద ప్ర‌భుత్వం అప్పు తెచ్చింది. ఇవి కాకుండా ఓడీ అప్పు కింద ఇంకో రూ.2000 కోట్లు తెచ్చుకున్నట్టు సమాచారం. ఈ అప్పులతో పాటు నవంబరు 1వ తేదీ ఆర్‌బీఐ ద్వారా సెక్యూరిటీలు వేలం వేసి రూ.1413 కోట్ల అప్పు తెచ్చారు. ఇవన్నీ కలుపుకొంటే ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు, పెన్షన్లు ఇవ్వవచ్చు. కానీ, ఇవ్వ‌డం లేదు. మ‌రి ఆ సొమ్ములు ఏమైన‌ట్టు? పోనీ.. ఖ‌జానా అయినా నిండుగా ఉందా? అంటే లేదు. ఖ‌జానా ఎప్ప‌టిక‌ప్పుడు ఖాళీగానే ఉంటోంది.

కాగ్ ఏమందంటే..

రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిలో 300 రోజులకుపైగా వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఎస్‌డీఎఫ్‌, ఓడీ అప్పులతోనే గడుపుతోంది. వీటిని పరిమితికి మించి అతిగా వాడుతోంది అని ఇటీవల కాగ్‌ తన నివేదికలోనూ, ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ‘క్రిసిల్‌’ సీఆర్డీఏ బాండ్లపై ఇచ్చిన రిపోర్టులోనూ వెల్లడించాయి. వేజ్‌ అండ్‌ మీన్స్‌, ఓడీలను అతిగా వాడడం అంటే బలహీన ఆర్థిక వ్యవస్థకు సంకేతమని అవి తేల్చేశాయి. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ అప్పులను మాత్రం తగ్గించుకోవడం లేదు. అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా అంటే అదీ లేదు. మ‌రి నిధులు ఏమ‌వుతున్నాయ‌నేది ప్ర‌శ్న‌గా మారింది.