ఎంఏ పరీక్ష‌లో వైసీపీ ప్ర‌శ్న‌.. మ‌రీ ఇంత రాజ‌కీయమా?

వారంతా ఎంఏ విద్యార్థులు. భ‌విష్య‌త్తులో ఉన్న‌త‌స్థాయి వ్య‌క్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపైన‌, మ‌రీ ముఖ్యంగా విశ్వ విద్యాల‌యాల‌పైనా ఉంది. కానీ, వారిని కూడా రాజ‌కీయంగా వాడుకునేందుకు ప్ర‌య‌త్నాలు సాగాయి. తాజాగా శుక్రవారం ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించిన ఎం.ఏ పరీక్షల్లో 4(b)వ ప్రశ్న కింద వైసీపీ ప్ర‌భుత్వ విధానాలు, కార్యక్రమాల గురించి వివరించండి అనే ప్రశ్న ఇచ్చారు. దీంతో విద్యార్థులు అవాక్క‌య్యారు. ఇదేం ప్ర‌శ్న‌.. అంటూ అంద‌రూ నివ్వెర పోయారు. స‌హ‌జంగా స‌బ్జెక్టుకు సంబంధించిన ప్ర‌శ్న అడుగాలి. కానీ, స‌బ్జెక్టుతో సంబంధం లేకుండా ప్ర‌శ్నించ‌డంపై వారు ఆశ్చ‌ర్య పోయారు.

నిజానికి పొలిటిక‌ల్ సైన్స్‌లో వైసీపీ రాజ‌కీయ పార్టీ అనే విష‌యం ఉంటే ఉండొచ్చేమో.. అది కూడా రివైజ్డ్ స‌బ్జెక్టు అయితేనే. కానీ, ఏకంగా వైసీపీ ప్ర‌భుత్వ విధానాల‌పై ప్ర‌శ్న అడ‌గ‌డం అభ్య‌ర్థుల‌ను షాక్‌కు గురి చేసింది. ఇక‌, ఈ విష‌యంపై రాజ‌కీయ పార్టీలు కూడా తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. విద్యార్థుల‌కు ఈ ప్ర‌శ్న ఇవ్వ‌డం ఏంట‌ని కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ ఖండించారు. విద్యార్థులు తల్లితండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పొలిటికల్ సైన్స్ ఎంఏ పేపర్లో ఈ విధంగా ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ప్రశ్నలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని బాలాజీ ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు ప్రశ్నించారు. అధికార పార్టీ కనుసనల్లో పనిచేస్తున్నారు అని చెప్పడానికి ప్రశ్నాపత్రం ఒక ఉదాహరణని తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనిని లంకిశెట్టి బాలాజీ తీవ్రంగా ఖండించారు. రాజకీయాలకు అతీతంగా విద్యాబోధన జరగవలసిన విద్యా సంస్థలలో ఈ విధమైన ప్రశ్నాపత్రాలు రావటం సిగ్గుచేటని బాలాజీ యూనివర్సిటీ అధికారులు దుయ్యబట్టారు.

అధికార పార్టీపై అభిమానం ఉంటే యూనివ‌ర్సిటీ అధికారులు పార్టీలో చేరాల‌ని, జెండా లు క‌ప్పుకోవాల‌ని అన్నారు. అంతేకానీ విద్యార్థి లోకం పై రాజ‌కీయాల‌ను రుద్దాలనుకోవడం అవివేకమని బాలాజీ విమర్శించారు. అధికార పార్టీ విధివిధానాలపై ప్రశ్న రూపొందించిన ప్రొఫెసర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని బాలాజీ డిమాండ్ చేశారు. మ‌రోవైపు టీడీపీ నుంచి కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వైసీపీ హ‌యాంలో విద్యాల‌యాలు రాజకీయాల‌కు కేంద్రంగా మారిపోయాయ‌ని నాయ‌కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. మ‌రి దీనిపై వైసీపీ నేత‌లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.