బాదుడే బాదుడు: చంద్ర‌బాబు కాన్వాయ్‌ ను బాదేశారు

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్‌షోలో రాళ్ల దాడి జ‌రిగింది. చంద్రబాబు కాన్వాయ్‌పై ఓ దుండగుడు రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు, చీఫ్ సెక్యూరిటీ అధికారి మధు గాయపడ్డారు. రాయి విసిరిన సమయంలో విద్యుత్ సరఫరా నిలివేశారు. పోలీసుల భద్రతా వైఫల్యంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు చంద్రబాబు రోడ్‌షోలో పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

రోడ్‌షో తొందరగా ముగించాలంటూ టీడీపీ నేతలపై పోలీసుల ఒత్తిడి తెచ్చారు. రోడ్‌షోకు భారీగా జనం తరలిరావడంతో అదనపు పోలీస్‌ బలగాలు రంగంలోకి దిగాయి. చంద్రబాబు వాహనానికి ముందు, వెనుకా పెద్దఎత్తున రోప్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు వాహనం చుట్టూ అదనపు భద్రతా బలగాలు ఏర్పాటు చేశారు. పెట్రోలు స‌హా ప‌న్నులు పెంచుతూ ప్ర‌జ‌ల ర‌క్తాన్ని వైసీపీ పీల్చేస్తోంద‌ని పేర్కొంటూ టీడీపీ కొన్నాళ్లుగా బాదుడే బాదుడు నిరసన నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో చంద్ర‌బాబు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. తొలుత ఆయ‌న నందిగామ‌లోని ప్ర‌ధాన వీధి గుండా రోడ్ షో నిర్వ‌హించారు. దీనికి భారీ ఎత్తున ప్ర‌జ‌లు హాజ‌ర‌య్యారు. అయితే, ఇంత‌లోనే రోడ్‌షో నిర్వహిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. ఈ ఘటనలో చంద్రబాబు ప్రధాన భద్రతా అధికారి మధుబాబుకి గాయాలయ్యాయి. మధుబాబు గడ్డం కింద గాయం కావడంతో వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే, మాజీ సీఎం, జ‌డ్‌+ కేట‌గిరీ భ‌ద్ర‌త ఉన్న త‌న‌కు పోలీసుల భద్రత సరిగా లేకపోవడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గూండాలు ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని హెచ్చ‌రించారు.