బైలింగ్వెల్ కాదు ..డైరెక్ట్ తమిళ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి , తెలుగు నిర్మాత దిల్ రాజు ‘వారసుడు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో ఈ సినిమాకు వరిసు అనే టైటిల్ పెట్టుకున్నారు. ముందు నుండి ఈ సినిమా విషయంలో అందరికీ ఓ సందేహం ఉంది. ఇది తమిళ్ సినిమానా ? లేక బైలింగ్వెల్ సినిమానా ?. తాజాగా ఈ డౌట్ కి క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్ వంశీ.

తాజాగా కోలీవుడ్ మీడియాకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు వంశీ పైడి పల్లి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఇది బైలింగ్వెల్ ఆ? లేక తమిళ్ సినిమానా ? అని అడిగేశాడు. ఆ ప్రశ్నకు ఎక్కువ ఆలోచించకుండా ప్రాపర్ తమిళ్ సినిమానే ఏంటి అలా అడుగుతావ్ అన్నట్టుగా వంశీ తమిళ్లో రియాక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూ అంతా తమిళ్ లో జరిగింది. వంశీ తమిళ్ లో బేషుగ్గా మాట్లాడుతూ సమాధానాలు ఇచ్చాడు.

అలాగే విజయ్ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాడు. ప్రతీ రోజు ముందు రోజు రాత్రి ఇంట్లో సీన్స్ హోం వర్క్ చేసుకుంటాడని , షాట్ పెట్టే ముందు కూడా ప్రిపేర్ అవుతాడని తనలో అది బెస్ట్ క్వాలిటీ అన్నట్టుగా చెప్పాడు. ఒక కుటుంబం, అందులో వారసుడు ఇదే బేస్ లైన్, కానీ విజయ్ ఫ్యాన్స్ ఏమేమో కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉంటాయని తెలిపాడు. యాంకర్ సినిమాకు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు అడుగుతుంటే అవన్నీ ఇప్పుడే చెప్తే దిల్ రాజు ఊరుకోరు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఏదేమైనా దర్శకుడే ఇది తమిళ్ సినిమా అంటూ అఫీషియల్ గా చెప్పేశాడు కాబట్టి ‘వారసుడు’ సినిమాను తెలుగులో డబ్బింగ్ సినిమాగానే పరిగణించాలి. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ డబ్బింగ్ మూవీతో విజయ్ తెలుగులో ఎంత కలెక్ట్ చేస్తాడో చూడాలి.