అరెరె… రాజగోపాల్ కి పెద్ద సమస్య వచ్చిపడిందె !!

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి దూసుకుపోతున్నారు. బీజేపీ నేతలు కూడా బాగా హడావుడి చేస్తున్నారు. నోటిఫికేషన్ రాకముందునుండే రాజగోపాలరెడ్డి కమలంపార్టీ అభ్యర్ధిగా ప్రచారంలోకి దిగేసిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల ఫలితాలను తారుమారుచేయటానికి కీలకమైన డబ్బుకు రాజగోపాల్ దగ్గరే సమస్యేలేదు. అయినా టెన్షన్ పడిపోతున్నారట.

ఇంత టెన్షన్ పడటానికి కారణం ఏమిటి ? ఏమిటంటే ఇప్పటికీ చాలా గ్రామాల్లో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని కాంగ్రెస్ నేతగానే చూస్తున్న గ్రామీణ ప్రాంత ఓటర్లు చాలామందున్నారట. ప్రచారంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతున్న బీజేపీ నేతలకు ఈ విషయం అనుభవపూర్వకంగా తెలిసొచ్చిందట. ప్రచారంలో వెళుతున్నపుడు ఎదురుపడిన వారిని కూడా ఓట్లడుగుతారు కదా. అలా అడుగుతున్నపుడు కొన్నిచోట్ల నేతలు రాజగోపాలరెడ్డికే ఓటు వేయాలని అన్నపుడు తప్పుకుండా కాంగ్రెస్ పార్టీ గురించి మాకు చెప్పాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారట.

ఇదే సమయంలో మరికొన్ని గ్రామాల్లో రాజగోపాల్ మీకందరికీ బాగా తెలిసిన వ్యక్తే కదాని నేతలు అడిగినపుడు కొందరు వృద్ధులు మాట్లాడుతు కాంగ్రెస్ నేతేగా మాకెందుకు తెలీదు అంటు ఎదురు ప్రశ్నిస్తున్నారట. అంటే ఇక్కడ గమనించాల్సిందేమంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే కాంగ్రెస్ నేతలుగా చాలా సంవత్సరాలుగా జనాల్లో పాతుకుపోయున్నారు. పైగా బ్రదర్స్ లో రాజగోపాలరెడ్డి బీజేపీలో చేరినా వెంకటరెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వదిలేసి బీజేపీలో చేరిన విషయం గ్రామీణప్రాంతాల్లోని కొందరు వృద్ధుల్లో రిజిస్టర్ కాలేదట.

అంటే రేపటి పోలింగ్ రోజున రాజగోపాల్ రెడ్డికి ఓట్లేయాలన్న ఉద్దేశ్యంతో కాంగ్రెస్ కు ఓటుగుద్దే అవకాశం ఉందని బీజేపీ నేతలకు అర్దమైపోయింది. ఇందుకే ఇపుడు వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకే ఇంటింటి ప్రచారం చేయటం, పోస్టర్లు, పాంప్లెట్లు, బ్యానర్లు కట్టాలని డిసైడ్ అయ్యారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళినపుడు రాజగోపాలరెడ్డి బీజేపీ అభ్యర్ధన్న విషయాన్ని పదేపదే చెప్పాలని నిర్ణయించుకున్నారు.