చూసుకుందాం రాము.. విజయసాయి సవాల్

ఈనాడు అధినేత రామోజీ రావు పేరెత్తితే చాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఆ పార్టీ నేతలు మంటెత్తిపోతారు. మధ్యలో కొంత కాలం ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్లు సంకేతాలు కనిపించాయి కానీ.. ఈ మధ్య ఈనాడు, ఈటీవీ సంస్థలు జగన్ అండ్ కోను గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి.

దీంతో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు గుర్తుకొస్తున్నాయి జనాలకు. ఐతే రామోజీ రావు మీద వైకాపా నేతల్లో ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఆయన పేరు ఎత్తినపుడు కొంచెం గౌరవంగానే సంబోధిస్తారు. చివరికి జగన్ అయినా సరే. కానీ ఆ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డి మాత్రం రామోజీ రావును ఇంకెవరూ సంబోధించని విధంగా ‘రాము’ అని సంబోధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

విశాఖలో విజయసాయి భూ దందా గురించి ఈనాడులో సంచలన కథనం ప్రచురితం అయింది తాజాగా. దాని గురించి రెండు రోజులు మౌనం వహించిన విజయసాయి మంగళవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా రామోజీ రావుకు పోటీగా తాను మీడియా రంగంలోకి వస్తున్నట్లు, ఛానెల్ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగానే రామోజీని రాము అని సంబోధిస్తూ ఆయన ఒక సవాలు విసిరారు.

‘‘ఈ రోజు పత్రికా మిత్రులందరి ముందు చెప్తా ఉన్నా. మీడియా రంగంలో, ఏ రంగంలో అయితే రాము ఉన్నాడో అదే రంగంలో నేనూ ఎంటర్ కాబోతున్నా. చూస్కుందాం రాము. చూస్కుందాం రాము. నీయొక్క ఛానెల్స్ ఏ రకంగా పని చేస్తాయి. నేను పెట్టబోయేటటువంటి ఛానెల్స్.. నేనే పెడతా. నేను పెట్టబోయేటవుంటి ఛానెల్ ఏ రకంగా పని చేస్తుందన్నటువంటి విషయం చూస్కుందాం. నీ రంగంలో నేను ఎంటర్ కాబోతున్నా. నేనొక ఛాలెంజ్‌గా తీసుకుంటున్నా’’ అని విజయసాయి పేర్కొన్నారు. ఈ మొత్తం మాటల్లో ‘రాము’ అన్న సంబోధన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రామోజీ మీద విజయసాయికి ఉన్న అసహనానికి ఇది నిదర్శనంగా కనిపిస్తోంది.